జనసేన సత్తా.. కాకినాడ రూరల్ ఎంపీపీ కైవసం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. వైసీపీకి గట్టి పట్టున్న కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) పదవిని జనసేన కైవసం చేసుకుంది. అది కూడా ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసేలా వ్యూహం రచించి పక్కాగా అమలు చేసి సత్తా చాటింది. ఫలితంగా కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేనకు చెందిన అనంత లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన దెబ్బకు వైసీపీకి ఈ మండల పరిషత్ లో మెజారిటీ ఉన్నా గానీ… ఎంపీపీ ఎన్నికకు డుమ్మా కొట్టక తప్పలేదు.

వైసీపీ అధికారంలో ఉండగా.. 2021లో ఏపీ వ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా… రాష్ట్రంలోని మెజారిటీ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోనే పడిపోయాయి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధలు వైసీపీని వీడి కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఇలాగే కాకినాడ రూరల్ మండల పరిధిలో ఏకంగా ఏడుగురు వైసీపీ ఎంపీటీసీలు జనసేన గూటికి చేరారు. అయినా వైసీపీకి ఇంకా 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు.

ఈ క్రమంలో గురువారం కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక జరగగా… జనసేన రచించిన వ్యూహం వర్కవుట్ అయ్యింది. జనసేనకు చెందిన ఏడుగురు ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోగా… వైసీపీకి చెందిన ఎంపీటీసీలు ఆ ఛాయలకే రాలేకపోయారు. కారణమేమిటో తెలియదు గానీ… వైసీపీకి చెందిన ఎంపీటీసీలు ఈ ఎన్నికకు దూరంగా ఉండిపోయారు. దీంతో టీడీపీ ఎంపీటీసీల మద్దతుతో జనసేన అభ్యర్థి అనంత లక్ష్మీ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అదికారి కీలక ప్రకటన చేశారు.

వాస్తవంగా కాకినాడ రూరల్ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు పట్టున్న నియోజకవర్గం.2009లో. ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కన్నబాబు… 2019లో వైసీపీ తరఫున కూడా ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఇక కాకినాడ సిటీ నుంచి వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కన్నబాబుకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇద్దరు బలమైన నేతలు ఉన్న వైసీపీని కాకినాడ రూరల్ లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తనదైైన వ్యూహంతో చిత్తు చేసిన తీరుపై ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.