విశాఖలో లులూ మాల్… 14 ఎకరాల భూమి కేటాయింపు

టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో ఏపీకి మహార్దశ పట్టిందనే చెప్పాలి. ఇప్పటికే గడచిన 9 నెలల కూటమి పాలనలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని గ్రౌండ్ కాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా కంపెనీలు రాష్ట్రానికి వస్తుండగా… అప్పటికే వచ్చి…వైసీపీ దౌర్జన్య కాండ కారణంగా ఏపీకి వదిలి పారిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. ఇలాంటి కంపెనీల్లో లులూ గ్రూప్ ను ప్రధానంగా చెప్పుకోవాలి. లులూ గ్రూప్ తిరిగి ఏపీకి రాగా…ఆ సంస్థకు గతంలో కేటాయించిన 13.83 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

గతంలో ఏపీకి టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా…ఏపీలోని విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేస్తామంటూ లులూ గ్రూప్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను స్వాగతించిన నాటి చంద్రబాబు సర్కారు అందుకు అవసరమైన భూమిని కూడా కేటాయించింది. ఏపీఐఐసీ ద్వారా సదరు భూమిని స్వాధీనం చేసుకున్న లులూ షాపింగ్ మాల్ నిర్మాణ పనులకు రంగం సిద్ధం చేసింది. మరికొన్నాళ్లు ఉండి ఉంటే…ఆ పనులు కూడా మొదలు అయ్యేవి. అయితే ఈలోగానే 2019 సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి వైైసీపీకి అధికార బదలాయింపు జరిగిపోయింది. వైసీపీ పాలనలో లులూకు అంతగా ప్రోత్సాహం లభించకపోగా…వేధింపులు ఎదురైనట్లు నాడు వార్తలు వినిపించాయి. దీంతో లులూ గ్రూప్ తన ప్రాజెక్టును రద్దు చేసుకుని వెళ్లిపోయింది. ఆ ప్రాజెక్టును ఆ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది.

అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు తీరిగి అధికారంలోకి రావడంతో లులూ గ్రూప్ తిరిగి ఏపీ వైపు చూసింది. చంద్రబాబు కూడా లులూ కంపెనీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో జనవరిలో లులూ గ్రూప్ చైర్మన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. గతంలో అనుకున్నట్లుగానే విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రతిపాదించారు. అందుకు బాబు ఓకే చెప్పడంతో పాటుగా గతంలో లులూకు కేటాయించిన భూమిని తిరిగి కేటాయించారు. ఈ మేరకు ఇటీవలి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఆధారం చేసుకుని ఏపీఐఐసీ సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి లులూకు అప్పగించేందుకు మార్గం సుగమం చేసింది. అంటే… అతి త్వరలోనే విశాఖలో లులూ మాల్ నిర్మాణం మొదలు కానుందన్న మాట.