వైసీపీలో అందగాళ్లంతా కూటమి సర్కారుకు టార్గెట్ గా మారుతున్నారంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడ జైలులో పరామర్శించిన తర్వాత జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యల మాటేమిటో గానీ…దళిత యువకుడు కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టై జైలులో కాలం వెళ్లదీస్తున్న వంశీ… నెల తిరక్కుండానే పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయారు.
తాజాగా మంగళవారం కోర్టు వాయిదాకు జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ మరింత నీరసించినట్టుగా కనిపించారు. అంతేకాకుండా ఆయన ముక్కుపై ఓ గాయం కూడా కనిపించింది. ముక్కుపై భాగంలో ఏ మేర గాయం అయిందో తెలియదెు గానీ… దానిపై ఓ తెలుగు రంగ ఆయింట్ మెంట్ అయితే పూసుకున్నట్లుగా స్ఫష్టంగా కనిపించింది. జైలులో ఉంటున్న వంశీకి పెద్దగా పనులేమీ ఉండవు కదా. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను భద్రతా కారణాల రీత్యా ఆయనను ప్రత్యేకంగా ఓ బ్యారక్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆయనపై జైలులో దాడి జరగడానికే ఆస్కారం లేదు. అయినా గానీ ఆయన ముక్కుపై ఆయింట్ మెంట్ కనిపించిన తీరు ఆసక్తి రేకెత్తించింది.
బయట తిరిగినంత కాలం ఆరోగ్యంగా కనిపించిన వంశీ… జైలులోకి వెళ్లగానే తనకున్న అనారోగ్య సమస్యలన్నింటినీ ఆయన బయటపెట్టక తప్పలేదు. జైలులో ప్రత్యేక వసతుల కోసం పిటిషన్ వేసిన సందర్బంగా ఆయన తన అనారోగ్య సమస్యలను కోర్టు ముందు పెట్టారు ఓ మోస్తరుగా ప్రత్యేక వసతులను కూడా పొందారు. అయినా గానీ… ఆయన ముక్కుకు ఏమైందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.