టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఒళ్లంతా కళ్లు చేసుకుని సాగతున్నారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ పాలన… నిత్యం బిజీబిజీగా సాగుతున్న లోకేశ్ ప్రతి విషయాన్ని చాలా లోతుగా పరిశీలిస్తూ సాగుతున్నారు. లోకేశ్ నిశిత పరిశీలన ఎంత లోతుగా ఉంటుందన్న విషయానికి నిదర్శనంగా మంగళవారం ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ కంపెనీ ప్రతినిధిగా వచ్చిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను ఆయన ఇట్టే గుర్తు పట్టేశారు.
అమెరికా అగ్రశ్రేణి కంపెనీ సిస్కో బృందం మంగళవారం అమరావతి వచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పిరేషన్ తో ఆ సంస్థ కీలక ఒప్పందం మీద సంతకం చేసింది. ఏపీకి చెందిన 50 వేల మంది యవతకు ఐటీ, అడ్వాన్స్డ్ రంగాల్లో శిక్షణను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వంతో సిస్కో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. సిస్కో బృందంలో ఉన్న వారితో సంభాషిస్తూనే.. ఆ బృందంలోని ఓ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు ఉందే అని భావించి… తన బుర్రకు కాస్తంత పదను పెట్టేశారు. అంతే…ఆ వ్యక్తి ఎవరన్న విషయం లోకేశ్ మదిలో మెదిలిపోయింది.
లోకేశ్ అనమానంగా చూసిన వ్యక్తి పేరు ఇప్పాల రవీంద్రారెడ్డి. గతంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా పని చేశారు. నాడు లోకేశ్ సహా టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపైనా ఆయన అసభ్యకర పోస్టులు పెట్టారు. విపక్షంలో ఉండగా… టీడీపీని, ఆ పార్టీ నేతలను వేధింపులకు గురి చేసిన నేతలను లోకేశ్ అంత ఈజీగా ఎలా మరిచిపోతారు? అందుకే ఠక్కున రవీంద్రా రెడ్డిని గుర్తు పట్టేశారు. సమావేశం ముగిసిన తర్వాత రవీంద్రారెడ్డి తీరుపై సిస్కో కంపెనీకి ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో అతడు లేకుండా చూడాలని కోరారు. అంతేకాకుండా రవీంద్రా రెడ్డిపై ప్రభుత్వపరంగానూ చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.