జగన్ కు ముందు నుయ్యి… వెనుక గొయ్యి

దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసమంటూ తమిళనాడు రాజధాని చెన్నైలో ఆ రాష్ట్ర అధికార పార్టీ డీఎంకే శనివారం ఓ కీలక సమావేశాన్ని నిర్వహించింది. వాస్తవానికి ఈ సమావేశానికి రావాలంటూ అందరికంటే ముందుగా ఏపీలోని విపక్షం వైసీపీకి ఆహ్వానం అందింది. డీఎంకేకు చెందిన ఓ ఎంపీ, తమిళనాడు మంత్రి తాడేపల్లి వచ్చి మరీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానాన్ని అందించారు. అయితే జగన్ ఈ సమావేశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ భేటీ సమయంలోనే ప్రధాన మంత్రికి ఇదే అంశంపై ఆయన ఓ లేఖ రాశారు. కారణమేమిటని ఆరా తీస్తే.. జగన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారిందని, ఈ కారణంగానే వైసీపీ ఈ భేటీకి దూరంగా ఉండక తప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఓ వైపు చెన్నైలో ఈ సమావేశం ప్రారంభం కావడానికి కాస్తంత ముందుగా జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. అది కూడా డీలిమిటేషన్ గురించే ఆయన ఈ లేఖ రాశారు. చెన్నై భేటీ ఏ తరహా ఆందోళనలను లేవనెత్తిందో… సరిగ్గా జగన్ కూడా అదే తరహా ఆందోళనలనే లేవనెత్తారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే… దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నది డీఎంకే, కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా దక్షిణాదికి చెందిన దాదాపుగా అన్ని పార్టీల ఆందోళన కూదా ఇదే. వైసీపీ కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తోంది. పీఎంకు రాసిన లేఖలో జగన్ కూడా ఇదే అంశాన్ని విస్పష్టంగా విశదీకరించారు. అంటే… జగన్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలతోనే జరుగుతున్నచెన్నై భేటీకి ఆయన హాజరైతే ఆ ఇంపాక్ట్ ఇంకా వేరేగా ఉంటుంది కదా. మరి జగన్ ఈ భేటీకి ఎందుకు వెళ్లలేదు?.

వాస్తవానికి బీజేపీతో వైసీపీకి నేరుగా పొత్తు లేదు గానీ… వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఎన్డీఏ తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలకు మద్దతుగా నిలిచింది. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ రాజకీయ ప్రత్యర్థి టీడీపీ ఎన్డీఏ చేరి అందులో కీలక బాగస్వామిగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ బీజేపీతో విభేదించి ముందుకు సాగేందుకు ససేమిరా అంటున్నారు. బీజేపీ వైరి వర్గం కాంగ్రెస్ ను విభేదించే జగన్ సొంత కుంపటి పెట్టుకున్నారు. ఇప్పుడు డీఎంకే భేటీకి కాంగ్రెస్ కూడా మద్దతు పలుకుతోంది. ఈ లెక్కన కాంగ్రెస్ ను బూచిగా చూపి జగన్ ఈ భేటీని రాలేనని చెప్పలేరు. అలాగని బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ భేటీకి ఆయన వెళ్లనూ లేరు.

తనపై నమోదు అయి ఉన్న అక్రమాస్తుల కేసు, ప్రస్తుతం తన పార్టీకి దక్కిన అతి తక్కువ సీట్లు, తన భవిష్యత్తు అవసరాలు… ఇలా అన్నింటినీ ఆలోచించుకున్న జగన్… తన పరిస్థితిని ముందు నుయ్యి, వెనుక గొయ్యలానే ఉందని నిర్ధారించుకున్నారు. ఈ కారణంగానే ఆయన చెన్పై భేటీకి వెళ్లకున్నా… సరిగ్గా ఆ భేటీ జరిగే సమయంలోనే ప్రధానికి అదే విషయంపై లేఖ రాసి.. తాను కూడా దక్షిణాది రాష్ట్రాల తరఫున పోరాడుతూనే ఉన్నానని చెప్పుకునే యత్నం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజమే మరి డీఎంకేతో జగన్ కు పెద్దగా విభేదాలేమీ లేవు. బీఆర్ఎస్ తో స్నేహమూ ఉంది. అయినా కూడా ఈ భేటీకి జగన్ హాజరు కాలేదంటే… జగన్ పరిస్థితి అలాగే ఉందని చెప్పక తప్పదు.