కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి తట్టుకోలేక.. ఇంటి పట్టునే ఉంటున్నారా? అంటే.. ఇంటి పట్టునే ఉంటున్నారని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇంకేముంది.. భూకంపం పుట్టిస్తాను.. కాంగ్రెస్ పార్టీని భూమార్గం పట్టిస్తాను.. అంటూ గత ఏడాది ఫిబ్రవరి లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల.. ఆదిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేసింది లేదు. పైగా.. తాను నమ్ముకున్న సెంటిమెంటు.. తాను ఎంచుకున్న రాజకీయ మార్గం కూడా పూర్తిగా విఫలమైంది.
ఇప్పుడు కాకపోతే..
ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కారు 10 మాసాలు పూర్తి చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రతిపక్ష పార్టీగా(ఒక్క ఎమ్మెల్యే కూడా లేకున్నా) షర్మిలకు చాలానే అవకాశం ఉంది. అయితే.. ఆమె `అయితే.. అన్న లేకపోతే అమ్మ` అంటూ.. ఇంటికే పరిమితమయ్యారని కాంగ్రెస్ పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. “మా మటుకు మేం.. ఆమె యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ, గడప దాటడం లేదు“ అని సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు చేసిన వ్యాఖ్యలు షర్మిలకు వినిపించకపోయినా.. ప్రజలకు , పార్టీ నాయకులకు మాత్రం బాగానే వినిపించాయి.
“కాంగ్రెస్ ఏముంది? పార్టీ పగ్గాలు చేపట్టిన వారు.. స్వలాభం కోసం తాపత్రయ పడుతున్నారు. ఇంకెవరు మాత్రం ఉంటారు“ అని.. ఏపీ మాజీ చీఫ్ రఘువీరా రెడ్డి పరోక్షంగా షర్మిలపై చేసిన వ్యాఖ్యలు.. అందరూ విన్నవే. షర్మిల వైఖరి కారణంగానే తాను పార్టీ మారాల్సి వచ్చిందన్న.. సాకే శైలజనాధ్ వంటి సీనియర్లు చాలా మంది.. పార్టీ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలను కలుసుకుని.. నిరంతరం వారితోనే ఉండాల్సిన షర్మిల.. ఆ దిశగా అడుగులు వేయకపోవడాన్ని.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు సైతం ఆక్షేపిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు కీలక విషయాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. 1) ఎస్సీ వర్గీకరణ. 2) వక్ఫ్ బోర్డు బిల్లు. రాష్ట్రంలోని కూటమి సర్కారు తీసుకున్న ఎస్సీ వర్గీకరణ విధానంపై మాల సామాజిక వర్గంతోపాటు.. మాదిగ సామాజిక వర్గం కూడా.. నిస్పృహతోనే ఉంది. తమకు 8 శాతం రిజర్వేషన్ కావాలని మాదిగలు కోరుతున్నారు. కాదు.. తమకు 9 శాతం కావాలని మాలలు కోరుతున్నారు. ఇక, వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై చంద్రబాబు సర్కారు ఏం చేస్తుందన్నది .. మైనారిటీ వర్గాల్లో ఆందోళనగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆయా వర్గాలకు అండగా నిలిచి వారి తరపున గళం వినిపించే ప్రతిపక్ష నాయకులు ఒక్కరంటే ఒక్కరూ కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అందరి చూపూ షర్మిలవైపు ఉండగా.. ఆమె మాత్రం తన దృష్టిని ఏకాగ్రతను ఇంటిపైనే ఉంచి.. పదిలంగా నాలుగు గోడల మధ్యే ఉన్నారన్న పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.