ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఆ హీరోయిన్ ఎందుకెళ్లిన‌ట్లు?

సినీ న‌టులు రాజ‌కీయ నాయ‌కుల కోసం ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్ల‌డం మామూలే. ఇక్క‌డ ప్ర‌ధానంగా ప‌రిచ‌యాలు, వ్య‌క్తిగ‌త సంబంధాలే కీల‌క పాత్ర పోషిస్తుంటాయి. త‌మ‌కు స‌న్నిహితులైన, లేదా బంధువులైన‌, ఇంకో ర‌క‌మైన సంబంధం ఉన్న‌ ఆ నాయ‌కుల గురించి సినీ తార‌లు జ‌నాల ముందు సానుకూలంగా మాట్లాడి వాళ్లకు ఓట్లేయ‌మ‌ని కోరుతారు. లేదంటే ఆ నాయ‌కుడి పార్టీ నుంచి వాళ్లేదైనా ప్ర‌యోజ‌నాలు ఆశించి ఎన్నిక‌ల ప్ర‌చారాల‌కు వెళ్లొచ్చు.

ఐతే బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ అమీషా ప‌టేల్ మాత్రం త‌న‌క‌స‌లు ప‌రిచ‌యం లేని నాయ‌కుడి కోసం ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లింది. అత‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీతోనూ ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. కేవ‌లం ప్ర‌చారానికి వ‌స్తే ఇంత అని డ‌బ్బిస్తానంటే ఓకే అనేసి ప్ర‌చారానికి వెళ్లిపోయి నానా తిప్ప‌లు ప‌డింది.

ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఆ నాయ‌కుడు త‌న‌ను చాలా ఇబ్బంది పెట్టాడంటూ మొర పెట్టుకుంది. ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న బీహార్‌లో ఎల్జేపీకి చెందిన డాక్ట‌ర్ ప్ర‌కాష్ చంద్ర అనే అభ్యర్థికి ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన అమీషాకు అక్క‌డ చేదు అనుభ‌వం ఎదురైంద‌ట‌. త‌న‌కు ఎంత‌మాత్రం తెలియ‌ని ప్రాంతంలో త‌న‌ను నిర్బంధానికి గురి చేశార‌ని.. ఫ్లైట్‌కు టైమ్ అవుతోంద‌న్నా వినిపించుకోకుండా త‌న‌ను ఆ అభ్య‌ర్థి అనుచరులు చుట్టుముట్టి బ‌ల‌వంతంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేయించార‌ని.. కొంచెం ఉంటే అక్క‌డి వాళ్లు త‌న‌ను రేప్ చేసేవార‌ని ఆమె ఆవేద‌న చెందింది.

ప్ర‌కాష్ చంద్ర‌ను అబ‌ద్ధాల కోరు అని, బ్లాక్‌మెయిల‌ర్ అని, డ‌ర్టీ ప‌ర్స‌న్ అని.. ఇలా చాలా తిట్లే తిట్టింది అమీషా. కానీ డ‌బ్బులు తీసుకుని త‌న‌క‌సలు ప‌రిచ‌య‌మే లేని వ్య‌క్తిని గెలిపించ‌మంటూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌సం, త‌ద్వారా ఆమె ఓట్లేసే జ‌నాల‌కు ఎలాంటి సందేశం ఇవ్వ‌ద‌లుచుకున్న‌ట్లు అన్న‌ది ఇక్క‌డ ప్ర‌శ్న‌.