వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మర్రి రాజశేఖర్ మరో బారీ షాకిచ్చారు. బుధవారం వైసీపీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి… జగన్ కు ఊహించని షాకే ఇచ్చారు. తాజాగా తాను టీడీపీలో చేరుతున్నానని గురువారం ప్రకటించిన మర్రి.. జగన్ కు మరో బారీ షాకిచ్చారు. వైైసీపీకి మర్రి రాజీనామానే జీర్ణించుకోలేకపోతున్న జగన్… మర్రి నేరుగా టీడీపీలోకి వెళుతున్నానని ప్రకటించడాన్ని తట్టుకోలేరన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
మర్రి రాజీనామా చేసిన బుధవారం కూడా అసెంబ్లీ ప్రాంగణంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మర్రి పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారని తెలిసినంతనే జగన్ అప్రమత్తమయ్యారు. మర్రి తన రాజీనామా నిర్ణయాన్ని నిలవరించేలా జగన్ పార్టీ నేతలను రంగంలోకి దించారు. జగన్ ఆదేశాలతో బొత్స సత్యనారాయణతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు మర్రిని లాబీల్లోనే ఆపేశారు. జగన్ తో మాట్లాడాలంటూ ప్రతిపాదించగా.. రాజీనామాపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని… అందులో మార్పు ఉండబోదని మర్రి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సందర్బంగా మర్రి రాజశేఖర్ మరింత ఆసక్తికర కామెంట్లు చేశారు. వైసీపీని వీడటానికి జగనే కారణమని ఆయన సంచలన ఆరోపించారు. తనకు ఇచ్చిన మాట మీద జగన్ నిలబడలేకపోయారని మర్రి ఆరోపించారు. 2019లోనే తనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పారని.. ఈ కారణంగానే తనను కాదని విడదల రజనీకి టికెట్ ఇచ్చినా సర్దుకుపోయానని అన్నారు. అయితే రజనీకి మంత్రి పదవి ఇచ్చిన జగన్…తనకు కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టారన్నారు.
2024లో అయినా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తే..గుంటూరు మేయర్ ను తీసుకువచ్చి చిలకలూరిపేటలో నిలిపారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అటు గుంటూరు వెస్ట్, చిలకలూరిపేటల్లో రెండు చోట్లా పార్టీ ఓడినా.. మళ్లీ రజనీని చిలకలూరిపేట ఇంచార్జీగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో ఇక తనకు వైసీపీలో న్యాయం జరిగే పరిస్థితి లేదని అర్థమైందని.. అందుకు జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కూడా ఆయన ఆరోపించారు మొత్తంగా జగన్ కారణంగానే తాను వైసీపీని వీడానని మర్రి తేల్చి పారేశారు.