మండ‌లిలో వైసీపీ.. మునుగుతున్న ప‌డ‌వేనా ..!

ఏపీ విప‌క్షం వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్న‌చందంగా ప‌రిస్థితి మారిపోయింది. అసెంబ్లీ లో ఆ పార్టీకి 11 మంది స‌భ్యులే ఉన్నారు. దీంతో ఇక్క‌డ ప్ర‌దాన ప్ర‌తిపక్ష హోదా ద‌క్క‌లేదు. ద‌క్కుతుంద‌న్న ఆశ‌లు కూడా క‌నిపించ‌డం లేదు. దీనిపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. కానీ, అధికార కూట‌మి మాత్రం వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఉన్న శాస‌న మండ‌లిలో కూడా ఇప్పుడు వైసీపీకి ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. మొత్తం 58 మంది స‌భ్యులున్న మండ‌లిలో వైసీపీకి 35 మంది స‌భ్యులు ఉన్నారు. టీడీపీ, జ‌న‌సేన‌, ఇత‌ర నామినేటెడ్ స‌హా.. ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు.. ఇత‌రులు ఉన్నారు. అయితే.. వైసీపీకి ఉన్న వారిలో తాజాగా చిల‌క‌లూరిపేట‌కు చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. వైసీపీకి ఆయ‌న రాజీనామా చేయ‌డంతో ఆయ‌న స‌భ్య‌త్వంపై ప్ర‌భావం ప‌డ‌క‌పోయినా.. పార్టీ త‌ర‌ఫున ఆయ‌న గ‌ళం వినిపించే అవకాశం లేదు.

అంటే.. వైసీపీ త‌ర‌ఫున కాకుండా.. ఇండిపెండెంటుగానే ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం

ఉన్న మండ‌లిలో వైసీపీ త‌ర‌ఫున ఉన్న‌వారు.. ఐదుగురు ఆ పార్టీకి, న‌లుగురు ఏకంగా మండ‌లికి కూడా రాజీనామాలు చేశారు. దీంతో వైసీపీ బ‌లం త‌గ్గిపోతోంది. రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాదికి మ‌రో 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి జారి పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అంటే.. వైసీపీ బ‌లం మ‌రింత త‌గ్గ‌నుంది.

ఈ ప‌రిణామం.. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో వైసీపీకి అసెంబ్లీ లో బ‌లం లేదు. ఈ నేప‌థ్యంలో మండలే కీల‌కం. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు మండ‌లి నుంచి కూడా నాయ‌కులు జారి పోతున్న నేప‌థ్యంలో మునిగిపోతున్న ప‌డ‌వ‌ను త‌ల‌పిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కూట‌మి రాజ‌కీయ వ్యూహాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌క‌పోతే.. వైసీపీ మ‌రింత డైల్యూట్ అయినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌పై ఎత్తులకు పై ఎత్తులు వేసి.. నాయ‌కుల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం అవ‌స‌రం. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.