వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరోమారు పోలీసు కస్టడీకి సిద్ధం కాక తప్పలేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వంశీని విచారించాల్సి ఉందని… ఈ కారణంగా వంశీని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అధికారులు విజయవాడలోని సీఐడీ కోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. సీఐడీ అధికారుల వాదనతో ఏకీభవించింది. వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఇటీవలే వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి వంశీ బెజవాడలోని జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ దఫా వంశీ పోలీసు కస్టడీని ఎదుర్కొన్నారు. ఆ విచారణలో వంశీ పెద్దగా విచారణకు సహకరించలేదన్న వాదనలు వినిపించాయి. కనీసం తన ఫోన్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని కూడా వంశీ పోలీసులకు చెప్పలేదట. అయితే తాడేపల్లి వెళ్లిన విషయాన్ని ఒప్పేసుకున్న వంశీ.. జగన్ ను మాత్రం కలవలేదని చెప్పారు.
తాజాగా 3 రోజుల పాటు సీఐడీ కస్టడీలోకి వెళ్లనున్న వంశీ… ఈ విచారణలో ఏఏ అంశాలను వెల్లడిస్తారన్నవిషయంపై ఆసక్తి నెలకొంది. లా అండ్ ఆర్డర్ పోలీసుల కంటే సీఐడీ పోలీసుల విచారణ ఒకింత వెరైటీగా ఉంటుందనే చెప్పాలి. నిందితుడిని ఇబ్బంది పెట్టకుండానే… లాఘవంగా వారి నుంచి సమాధానాలు రాబట్టే విషయంలో సీఐడీ పోలీసులకు మంచి పట్టే ఉందని చెప్పక తప్పుదు. అంతేకాకుండా ఆయా అంశాలకు సంబంధించి పక్కా ఆధారాలను ముందు పెట్టి మరీ సీఐడీ అదికారులు నిందితులను ప్రశ్నిస్తారు. ఫలితంగా వంశీ కూడా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి దారి తీసిన అసలు వాస్తవాలను బయటపెట్టక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.