అప్పులు త‌ప్ప‌వా రేవంత్ స‌ర్‌!

రాష్ట్రాన్ని గ‌త ప‌దేళ్లు పాలించి కేసీఆర్‌.. అప్పులపాలు చేశార‌ని ప‌దే ప‌దే విమ‌ర్శించే సీఎం రేవంత్ రెడ్డి సైతం త‌న పాల‌న‌లో అప్పులు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌లోనే స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. తాజా బ‌డ్జ‌ట్‌లో ఏకంగా 66 వేల కోట్ల‌కు పైగానే అప్పులు చేయాల్సి వుంటుంద‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తేల్చి చెప్పారు. అయితే.. ఇది ప్ర‌క‌టిత అప్పు కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం ద్ర‌వ్య‌లోటును ప‌రిశీలిస్తే.. దాదాపు 70 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఉంది. దీనిని భ‌ర్తీ చేసేందుకు అప్పులు చేస్తున్నార‌ని అనుకున్నా.. బ‌డ్జ‌ట్‌లో ప్ర‌తిపాదిత అప్పులు 66 వేల కోట్ల రూపాయ‌లు ఉన్నాయి. అంటే మ‌రో ప‌ది వేల కోట్ల‌ను కార్పొరేష‌న్లు స‌హా ఇత‌ర మార్గాల్లో స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుం ది. ఇక‌, కీల‌క‌మైన ఆదాయ వ‌న‌రుల‌కు వెచ్చించే మూల ధ‌న వ్య‌యాన్ని 36 వేల కోట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. త‌ద్వారా రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంది.

అలానే.. సుమారు ల‌క్ష కోట్ల‌రూపాయ‌ల‌ను అంటే.. పూర్తి బ‌డ్జెట్‌లో మూడో వంతు నిధుల‌ను ప్ర‌భుత్వం సంక్షేమానికి కేటాయిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసేందుకు 56084 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు. ఇక‌, ఎస్సీ సంక్షేమానికే 40,232 కోట్ల‌ను కేటాయించారు. అలానే బీసీ సంక్షేమానికి 11 వేల కోట్ల ను ఇచ్చారు. అంటే.. సంక్షేమ ప‌ద్దులోను మూడో వంతు బ‌డ్జ‌ట్ నిధులు క‌రిగిపోతున్నాయి.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పైకి చెబుతున్న 66 వేల కోట్ల అప్పు మాత్ర‌మే రాష్ట్రానికి స‌రిపోయేలా క‌నిపిం చ‌డం లేదు. ప్ర‌ధాన‌మైన మౌలిక రంగాల అభివృద్ధి, పెట్టుబ‌డుల సాధ‌న కోసం భారీ స్థాయిలో వెచ్చించాల్సి ఉన్న ద‌రిమిలా.. అప్పుల దిశ‌గానే రేవంత్ రెడ్డి స‌ర్కారు ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తుంద‌న్న సంకేతాలు ఈ బ‌డ్జ‌ట్ స్ప‌ష్టం చేసింది.