అక్కడ వేటేయరు!… ఇక్కడ రాజీనామాలు ఆమోదించరు!

చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల వ్యవహార తీరుకు సంబంధించి చట్టాల్లోని నియమ నిబంధనలు పెద్దగా పనిచేయడం లేదు. చట్టాలను పక్కనపెట్టేస్తున్న కొందరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయపార్టీల భావాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ విమర్శల పాలు అవుతున్నారు. అలాంటి వారిలో సభాధ్యక్ష స్థానాల్లో ఉన్న నేతలు కూడా ఉంటుండటంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరస్పర విరుద్దంగా ఉంటోంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో ఆయా చట్టసభల అధ్యక్ష స్థానాల్లో ఉన్న వారిపై విమర్శలు చెలరేగుతున్నాయి. అయినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం.

తెలంగాణ విషయానికి వస్తే… 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికార బదలాయింపు జరిగింది. ఫలితంగా బీఆర్ఎస్ టికెట్లపై ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారిలో ఓ 10 మంది హస్తం పార్టీ గూటికి చేరారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించింది. ఆ తర్వాత పలుమార్లు ఆయనను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధులు పార్టీ మారిన వారిపై చర్యలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. స్పీకర్ నుంచి ఆశించిన మేర స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయినా కూడా పెద్దగా స్పందనేమీ కనిపించలేదు.

ఇక ఏపీ విషయానికి వస్తే… తెలంగాణలో ఉన్న పరిస్థితికి పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీకి అదికార బదలాయింపు జరిగింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, కల్యాణ చక్రవర్తిలు తమ సభ్యత్వాలు రాజీనామాలు చేశారు. అదే సమయంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వాలకూ వారు రాజీనామా చేశారు. ఇది గతేడాది ఆగస్టులో జరిగింది. నాటి నుంచి ఈ నలుగురు తమ రాజీనామాలను ఆమోదించాలని మండలి చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత మోషేన్ రాజును కోరుతున్నారు. సరైన సమయంలో నిర్ణయ తీసుంటామని చెబుతున్న రాజు… ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని దాటవేస్తూనే ఉన్నారు.

తాజాగా ఈ నలుగురు సభ్యులు బుధవారం నాటి సమావేశాలకు హాజరై… తమ రాజీనామాలను ఇప్పటికైనా ఆమోదించాలని కోరారు. తాము తమ వ్యక్తిగత కారణాలతోనే తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశామని వారు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. తమ కుటుంబ పరిస్థితులో, లేదంటే మానసిన ఒత్తిడులో, అనారోగ్య సమస్యలో… ఏదైనా తమ వ్యక్తిగత కారణాలతోనే సభ్యత్వాలకు రాజీనామాలు చేశామని… వాటిని ఇప్పటికైనా ఆమోదించాలని వారు కోరారు. ఈ సందర్భగా పాత పాటే పాడిన రాజు…సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారిని కూర్చోబెట్టారు.అయినా తమ పదవులకు రాజీనామాలు చేసిన నేతలే… వాటిని ఆమోదించమని కోరుతుంటే… దానిపై తాత్సారం చేయాల్సిన అవసరం ఏముందని జనం ప్రశ్నిస్తున్నారు.