మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర పెద్దలను కలిసేందుకు మంగళవారం రాత్రికే ఢిల్లీ చేరిన చంద్రబాబు… బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బిల్ గేట్స్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బాబుతో పాటుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్ కుమార్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సమావేశం దాదాపుగా 40 నిమిషాల పాటు కొనసాగింది.
బిల్ గేట్స్ తో భేటీ ముగిసిన తర్వాత… ఆ భేటీ గురించి చంద్రబాబే స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. గేట్స్ తో భేటీ ఫలప్రదంగా ముగిసిందని ఈ ప్రకటనలో ఆయన తెలిపారు. ఏపీ ప్రలజకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఏ తరహా చర్యలు చేపట్టాలన్న విషయంపై సుదీర్గంగా చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, వంటి కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి గేట్స్ ఫౌండేషన్ సహాకారంపై చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అందివచ్చిన శాస్త్ర సాంకేతికతతో ప్రజల జీవన విధానాన్ని మరింత మెరుగు చేసే దిశగా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్న విషయంపైనా కీలక చర్చలు జరిగినట్లు చంద్రబాబు వెల్లడించారు.
స్వర్ణాంధ్రప్రదేశ్-2047 సాకారం దిశగా ముందుకు సాగుతున్నామన్న చంద్రబాబు..ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వినియోగంపై గేట్స్ లో చర్చలు సాగించామని తెలిపారు. ఈ అధునాతన సాంతకేక పరిజ్ఞానాల సాయంతో ఏ మేర ఫలితం సాధించవచ్చన్న దిశగా లోతైన సమీక్షలు జరిపామని తెలిపారు. ఏపీ ప్రజల బాగోగుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం గేట్స్ తన విలువైన సమయాన్నికేటాయించడం పట్ల చంద్రబాబు హర్షం ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి గేట్స్ మద్దతుగా నిలిచిన తీరు కూడా ఆహ్వానించదగ్గదని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.