అసలు నాగ్‌పూర్‌లో ఏం జరుగుతోంది?

ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా చంపేసిన విధానం గురించి మరోసారి చర్చించుకోవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో నాగ్‌పూర్ నగరం తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధి వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొదట విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని నిరసనలు ప్రారంభమయ్యాయి.

ఈ నిరసనల నేపథ్యంలో కొన్ని గంటల్లోనే ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ముస్లిం పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారంటూ పుకార్లు వ్యాపించడంతో పరిస్థితి అదుపు తప్పింది. మహల్ ప్రాంతంలో రెండు వర్గాలు రాళ్లదాడికి దిగడంతో కొందరికి గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి అల్లరి మూకలను అదుపు చేయడానికి లాఠీచార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ప్రస్తుతం నాగ్‌పూర్‌లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఔరంగజేబు సమాధి వద్ద పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు బలగాలను మోహరించారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అల్లర్లలో అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలిసింది. పరిస్థితిని సమీక్షించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ప్రజలను సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

నాగ్‌పూర్ ప్రజలు ఎప్పుడూ శాంతియుతంగా జీవిస్తున్నారని, ఎలాంటి అపోహలకు లోనవ్వొద్దని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రజలను శాంతి పరిరక్షణకు ఆహ్వానించారు. ఈ ఘటన రాజకీయ పరంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్, సీఎం ఫడ్నవీస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఔరంగజేబు నియంతపరమైన పాలన విధించినట్లే, ఫడ్నవీస్ కూడా మతాన్ని ఆధారంగా చేసుకుని ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫడ్నవీస్‌ను ఔరంగజేబుతో పోల్చడం కాంగ్రెస్ భయానక మత రాజకీయాన్ని బయటపెడుతోందని, ఇది వారి బాధ్యతారాహిత్యాన్ని వెల్లడిస్తోందని విమర్శించింది. ప్రస్తుతం పోలీసుల చర్యల వల్ల నగరంలో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, ఈ ఉద్రిక్తతల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.