తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం.. అనూహ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు గురించిన ప్రస్తావన వచ్చింది. దీంతో సభలో ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తమైంది. బీఆర్ఎస్ సభ్యుడు.. పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా నది యాజమాన్య సంస్థ(కేఆర్ ఎంబీ) వ్యవహారంపై స్పందించారు. కేఆర్ ఎంబీ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డి చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు.
“ఇప్పుడు కేఆర్ ఎంబీ పరిస్థితి ఎలా ఉందంటే.. అధ్యక్షా.. చంద్రబాబు చెబితే కూర్చుంటారు. చంద్రబాబు చెబితే నిలబడతారు. అంతా చంద్రబాబు చెప్పినట్టే కేఆర్ ఎంబీ చేస్తోంది. దీంతో మన ప్రజలకు నీటి కష్టాలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి కూడా.. సీఎం రేవంత్ రెడ్డి ఏమీ చేయడం లేదు. ఇదేదో తెరవెనుక ఏదో జరుగుతున్నదన్న సందేహాలు వచ్చేలా చేస్తోంది. అంతా చంద్రబాబు చెప్పినట్టు చేస్తే.. కేఆర్ ఎంబీని.. చంద్రబాబు ఎంబీగా మార్చేయా” అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
అంతేకాదు.. హైదరాబాద్ ప్రజలకు తాగు నీటి కొరత ప్రారంభమైందని చెప్పారు. అలా కాదని మంత్రి చెప్పగలరా? అంటూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నీటి కొరత లేనప్పు డు.. హైదరాబాద్లోని వాటర్ ట్యాంకులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ విషయంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.ఈ సమయంలో జోక్యం చేసుకున్న మంత్రి భట్టి.. పల్లా చాలా విజ్ఞానవంతుడని అనుకున్నామని.. కానీ, ఆయన బీఆర్ఎస్ కళ్లద్దాలు పెట్టుకుని బీఆర్ఎస్ మైకులో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
తాము అధికారంలోకి వచ్చాక.. అనేక సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కృష్ణా నది నుంచి మనకు రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదులుకోకుండా.. చేస్తున్నామని, దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రానికి లేఖలు కూడా రాశారని.. ఈ విషయం తెలిసి కూడా పల్లా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో ట్యాంకర్లు రావడం అనేది ఇప్పుడు కొత్తకాదని.. గతం నుంచే ఉందని.. నీటి సమస్య రాకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.