జయకేతనం పేరిట జనసేన ఆవిర్బావ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం శివారు ప్రాంతం చిత్రాడలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరిగాయి. 10 లక్షల మందికిపైగా హాజరయ్యే ఈ సభ కోసం అంతకుమించిన ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా మరే పార్టీ నిర్వహించనంత రీతిలో జనసేన ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలన్న ఆ పార్టీ అధిష్ఠానం సంకల్పానికి అనుగుణంగానే ఏర్పాట్లు జరిగాయి. శుక్రవారం సాయంత్రం జరిగే ఈ సభ నిజంగానే ఓ మైలురాయిగా నిలవనుందని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే… జయకేతనం పేరిట జనసేన ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న వేళా విశేషం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. సరిగ్గా హోలీ వేడుకల రోజే జనసేన ఆవిర్భావ పండుగ జరుగుతుండటం గమనార్హం. చెడుపై మంచి సాధించిన విజయం నేపథ్యంలో హోలీ వేడుకలు ఆనంద డోలికల్లో ఏటా జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే రీతిలో రాష్ట్రంలో అప్పటిదాకా సాగిన దుర్మార్గ పాలనకు చరమగీతం పాడటంలో జనసేనదే కీలక భూమిక అని చెప్పాలి. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తుతో పాటుగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక… పట్టువిడుపులతో సాగిన పవన్ పయనం… అన్నీ కలిసి కూటమికి ఘన విజయం సాధించిపెట్టాయి.
ఈ లెక్కన కూటమిలో కీలక భాగస్వామిగా టీడీపీనే కొనసాగుతున్నా… ఆ కీలక భాగస్వామికి వెన్నుదన్నుగా నిలిచిన జనసేనకూ అంతే ప్రాధాన్యం ఉందని చెప్పక తప్పదు. ఈ లెక్కన చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా యావత్తు దేశం హోలీ వేడుకలను రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటే… దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడిన జనసేన కూడా సరిగ్గా హోలీ వేడుకల రోజే తన ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైైభవంగా జరుపుకుంటోంది. ఏ లెక్కన చూసినా.. జయకేతనం సభ ముహూర్త బలంతో చరిత్రలో నిలిచిపోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.