వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని సీఐడీ పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి గుంటూరు కోర్టులో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు బెయిల్ ఇవ్వాల్సిందేనని… లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ పోసాని… న్యాయమూర్తి ముందు బోరుమంటూ విలపించారు. కళ్లల్లో కన్నీళ్లు ధారగా కారుతుండగా…తన పరిస్థితిని ఆయన న్యాయమూర్తి ముందు విన్నవించారు. అయితే పోసానికి బెయిల్ ఇవ్వరాదంటూ సీఐడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి… పోసానికి 14 రోజుల రిమాండ్ ను విధించారు.
ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లోని చిక్కులు వీడిపోయాయని..ఇక తాను జైలు నుంచి విడుదల అవుతున్నానని పోసాని మంగళవారం రాత్రి భావించారు. అయితే బుధవారం ఉదయానికంతా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు గుంటూరు సీఐడీ పోలీసులు పోసానిపై 5 నెలల క్రితం ఓ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీ వారెంట్ తీసుకుని బుధవారం ఉదయానికంతా పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలు ముందు వారు ప్రత్యక్షమయ్యారు. ఆ వెంటనే పోసానిని వర్చువల్ గా కర్నూలు న్యాయమూర్తి ముందు హాజరు పరచి పోసానిని తమ అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు.
ఈలోగా వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ముందు పొన్నవోలు వాదనలు చెల్లుబాటు కాలేదు. దీంతో ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అప్పటికే కర్నూలు నుంచి గుంటూరు చేరుకున్న సీఐఢీ అధికారులు… పోసానిని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ పొన్నవోలు నేతృత్వంలోని న్యాయవాదుల బృందం తమ వాదనలను వినిపించింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 పోసానికి వర్తించదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే పోసాని చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు.
ఈ క్రమంలో అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉన్న పోసాని ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. న్యాయమూర్తి ముందు పోసాని కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆరోగ్యం ఏమీ బాగోలేదని, తనకు ఇప్పటికే రెండు ఆపరేషన్లు అయ్యాయని ఆయన జడ్జికి చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే తన తల నరికేయండని కూడా పోసాని వ్యాఖ్యానించారు. తనకు బెయిల్ ఇవ్వాల్సిందేనని… లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని కూడా పోసాని జడ్జీ ముందు విలపించారు. పోసాని వాదనను విన్న న్యాయమూర్తి వాదనలు పూర్తి అయ్యాయని చెప్పి అందరినీ బయటకు పంపారు. ఆ తర్వాత ఇరు వర్గాల వాదనలను మరోమారు పరిశీలించిన న్యాయమూర్తి… పోసానికి 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ తీర్పు చెప్పారు. దీంతో పోసానిని పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు.