ఫీజు పోరు కాస్తా.. రణరంగం కానుందా?

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ బుధవారం ఫీజు పోరు పేరిట రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. అయితే ఈ పోరు బాట కాస్తా రణరంగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఫీజు పోరుకు అక్కడికక్కడే సమాధానం చెబుతామంటూ అధికార టీడీపీ రంగంలోకి దిగిపోయింది. ఈ మేరకు టీడీపీ విద్యార్థి విభాగం తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు. వైసీపీ ఫీజు పోరు చేపట్టే కలెక్టరేట్ల వద్దే వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని… అక్కడే తాము వైసీపీతో చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు.

టీడీపీ నేతృత్వంలోని కూటమి ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు భారీ ఎత్తున హామీలు ఇచ్చిందని వైసీపీ వాదిస్తోంది. అయితే కూటమిని నమ్మి ఓట్లు వేసిన యువతను మోసం చేసేలా కూటమి సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. ఇప్పటిదాకా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి నిధులను విడుదల చేయలేదని చెబుతోంది. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద రూ3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిందని.. అయితే ఇప్పటిదాకా కూటమి సర్కారు భృతి గురించే మాట్లాడటం లేదని కూడా వైసీపీ వాదిస్తోంది.

అయితే వైసీపీ వాదనను టీఎన్ఎస్ఎఫ్ తిప్పి కొడుతోంది. నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లుగా రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పామని… అందులో ఇప్పటిదాకా 4 లక్షల మేర ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని వెల్లడిస్తోంది. అంతేకాకుండా పేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు, విద్యార్థుల హాస్టల్ బకాయిలను కూడా ఎప్పటికప్పుడు విడుదల అవుతూనే ఉన్నాయని వాదిస్తోంది. వైసీపీ బకాయి పెట్టి వెళ్లిన ఫీజు బకాయిలను కూడా కూటమి సర్కారే చెల్లించిందని గుర్తు చేస్తోంది. ఇవే అంశాలపై జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైసీపీతో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రణవ్ తెలిపారు. వెరసి బుధవారం నాటి ఫీజు పోరు కాస్తా… టీఎన్ఎస్ఎఫ్ ఎంట్రీతో రణరంగంగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.