కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… ఎమ్మెల్యేగా ఏది చేసినా ఇతరులకు చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఆది నుంచీ ఇదే ఒరవడిని కొనసాగిస్తూ వస్తున్న ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే… ఆదివారం ఓ రికార్డును సొంతం చేసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు ఏకంగా 105 అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. నిజంగానే ఈ తరహాలో ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా ఇన్నేసి పనులను ఒకే రోజు ప్రారంభించిన దాఖలా లేదు. రాష్ట్రంలోనే కాకుండా యావత్తు దేశంలోనూ ఈ తరహా ప్రారంభోత్సవాలు లేవు. కోటంరెడ్డి తన పేరిట లిఖించుకున్న ఈ రికార్డు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను మంత్రముగ్ధుడిని చేసిందనే చెప్పాలి. అందుకే కాబోలు.. కోటంరెడ్డి చర్యను ఆకాశానికెత్తుతూ లోకేశ్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు.
ఏపీలో కూటమి సర్కారు అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ పాలన కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో ఆ దుర్భర పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే దిశగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అహర్నిశలూ అబివృద్ధిని కాంక్షిస్తూ కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలకు దన్నుగా నిలుస్తూ కోటంరెడ్డి ఒకే రోజు 105 అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇదే విషయాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించిన లోకేశ్… చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందనడానికి కోటంరెడ్డి రికార్డు ప్రారంభోత్సవాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా కోటంరెడ్డి ప్రజా ప్రతినిధులకు స్ఫూర్తిగా నిలిచారని లోకేశ్ కీర్తించారు. దేశ చరిత్రలోనే కోటంరెడ్డి రికార్డు ప్రారంభోత్సవాలు ఓ అరుదైన ఘట్టం అని కూడా లోకేశ్ అభివర్ణించారు.
గతంలో వైసీపీలో ఉన్నప్పుడూ కోటంరెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎంతో బాధ్యతతో మెలిగారని చెప్పాలి. ఓ డ్రైనేజీపై వంతెన కోసం నడు మేర మురుగు నీటిలో నిలబడి నిరసన తెలిపిన కోటంరెడ్డి సంచలనం సృష్టించారు. అధికారంలో ఉన్నది తన పార్టీనా… వైరి వర్గమా? అన్న తేడా లేకుండా తన నియోజకవర్గంలో అభివృద్ధి జరుతుందా?.. లేదా? అన్న దానిపైనే గురి పెట్టి కోటంరెడ్డి సాగుతూ ఉంటారు. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఆదివారం నాటి రికార్డు ప్రారంభోత్సవాల్లోనూ ఆయన తనదైన శైలిని పాటించారు. ఆయా పనులను ఆయన కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలతోనే ప్రారంభింపజేశారు. ఈ చర్యతో అటు అభివృద్ధికే కాకుండా ఇటు పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకూ కోటంరెడ్డి సమ ప్రాధాన్యం ఇచ్చారు.