ఆలస్యంగా ఆహ్వానం పంపారు.. మేము రాము

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన అధికారిక నివాసం ప్రజా భవన్ లో శనివారం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులో ఈ భేటీని నిర్వహించాలని భట్టి తలచారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశానికి అధికార కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ పార్టీకి చెందిన ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఫలితంగా అఖిల పక్ష సమావేశం కాస్తా… రెండు పార్టీల భేటీగా మారిపోయింది. ఈ బేటీకి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఎంపీలందరూ హాజరు కాగా… మజ్లిస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తూ కీలక చర్చ జరుపుదాం రమ్మంటూ… డిప్యూటీ సీఎం హోదాలో భట్టి రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ఇదివరకే లేఖలు రాశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బాగంగా మలి విడత సమావేశాలకు సమయం ఆసన్నమైన వేళ ఈ సమావేశం కీలకమైనదని… అన్ని పార్టీలు తమ పార్లమెంటు సభ్యులను ఈ సమావేశానికి పంపి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని భట్టి తన లేఖలో కోరారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ సమావేశానికి హాజరు కావడం ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అన్నిపార్టీలు సహకరించాలని ఆయన కోరారు.

అయితే భట్టి వినతిని బీఆర్ఎస్ సహా బీజేపీలు తిరస్కరించాయి. ఈ మేరకు భట్టికి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డిలు ప్రత్యుత్తరాలు రాశారు. ఈ లేఖల్లో ఆ రెండు పార్టీలు కూడా ఒకే కారణాన్ని ప్రస్తావించారు. అధికార పక్షం నిర్వహిస్తున్న ఈ భేటీకి హాజరు కావాలని తమకూ ఉందని పేర్కొన్న ఇరు పార్టీలు… సమయాభావం వల్లే ఈ భేటీకి హాజరు కాలేకపోతున్నామని తెలిపాయి. ఇలాంటి కీలక భేటీ గురించి చాలా ముందుగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదన్న బీజేపీ, బీఆర్ఎస్ లు… అప్పటికప్పుడు రమ్మంటే ఎలా కుదురుతుందని తెలిపాయి. ఆలస్యంగా ఆహ్వానం పంపడం… అప్పటికే పలు ముఖ్యమైన కార్యక్రమాలకు తాము షెడ్యూల్ ఖరారు చేసుకున్నామని… ఫలితంగానే ఈ భేటీకి రాలేకపోతున్నామని తెలిపాయి. అయితే ఆల్ పార్టీ మీట్ కు పిలిచినందుకు ఇరు పార్టీలు భట్టికి ధన్యవాదాలు తెలిపాయి.