వైసీపీలో .. ఎవ‌రి గోల వారిదే!!

అధికార వైసీపీలో ఎవ‌రి గోల వారిదేనా? అధినేత జ‌గ‌న్ ఒక‌దారిలో వెళ్తుంటే.. మంత్రులు మ‌రో దారిలో వెళ్తున్నారా? స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకో దారిలో న‌డుస్తున్నారా? అంటే.. ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో వైసీపీలో ఎవ‌రి గోల వారిదే అన్న మాట వినిపిస్తోంది. ఎవ‌రిని ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. త‌న‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ ప్రారంభ‌మైంది. వీటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో మునిగిపోయారు. మ‌రోవైపు త‌న పాల‌న‌కు ప్ర‌తిప‌క్షాల‌కు తోడు న్యాయ‌వ్య‌వ‌స్థ అడ్డు ప‌డుతోంద‌నే భావ‌న‌లో మునిగిపోయి.. ఎదురు దాడి చేయ‌డంతోనే స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు.

దీంతో ఆయ‌న కింది స్థాయిలో ఏం జ‌రుగుతోందో.. తెలుసుకునే స‌మ‌యం లేకుండా పోయింద‌ని అంటు న్నారు. ఇక‌, మంత్రుల విష‌యానికి వ‌స్తే.. వారి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు ఉన్నార‌నే వ్యాఖ్య‌లు కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. కొంద‌రు మంత్రులు మాత్రం ముఖ్య‌మంత్రి క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఆయ‌న‌కు దూరంగా ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నార‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంల‌లో పాముల పుష్ప శ్రీవాణి, నారాయ‌ణ స్వామి వంటివారు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నార‌ట‌! ఇక‌, జిల్లాల్లో మంత్రులు కూడా త‌మ ప‌నుల్లో తాము బిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది. దీంతో సాధార‌ణ పాల‌న‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టేవారు క‌రువ‌య్యార‌ని అంటున్నారు.

ఇక‌, ఎంపీలు, ఎమ్మెల్యేల విష‌యాలు కూడా దీనికి భిన్నంగా ఏమీలేవ‌ని తెలుస్తోంది. త‌మ వారికి ప‌నులు చేయించుకోవ‌డం, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీయ‌డానికే ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. దీంతో సాధార‌ణ పాల‌న‌, ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కాలు వంటివాటిని కేవ‌లం స‌చివాల‌య వ్య‌వ‌స్థే ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని, వ‌లంటీర్లే అన్నీ తామై వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

నిజానికి చంద్ర‌బాబు పాల‌న‌లో ఇలాంటి ప‌రిస్థితి లేదు. అప్ప‌ట్లో మంత్రులు అంతా అధినేత క‌నుస‌న్న‌ల్లో ముందుకు సాగారు. ఒక‌రిద్ద‌రు మిన‌హా.. ఎవ‌రూ సొంత‌గా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించిన ప‌రిస్థితి లేదు. కానీ, ఇప్పుడు అంతా సొంత వ్య‌వ‌హారానికి పెద్ద పీట వేస్తున్నారు. దీనికి జ‌గ‌న్ త‌న సొంత కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌డ‌మే కార‌ణంగా ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి ఇదే ప‌రిస్థితి మ‌రికొన్నాళ్లు సాగితే.. ప‌ట్టు త‌ప్ప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.