అరెరే… వీహెచ్ ప్లాన్ రివర్స్ కొట్టేసిందే

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు తన సామాజిక వర్గం మున్నూరు కాపు నేతలతో శనివారం తన ఇంటిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్న ఆయన… పరిస్థితిని చక్కదిద్దే క్రమంలోనే ఈ భేటీని నిర్వహించినట్లుగా సమాచారం. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగా బీఆర్ఎస్, బీజేపీల్లో ఉన్న మున్నూరు కాపు నేతలను కూడా వీహెచ్ ఆహ్వానించారు. వీహెచ్ ఆహ్వానాన్ని మన్నించిన ఆ పార్టీల నేతలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.

ఈ బేటీ గురించిన సమాచారం…ఒక్కటంటే ఒక్క రోజులోనే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చెవిలో పడిపోయిది. నేతలు ఎవరన్న దానిని చూడకుండా…పార్టీ లైన్ దాటిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న మీనాక్షి… శనివారం ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మల్లన్నపై పార్టీ క్రమశిక్షణా కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలో జరుగుతున్న ఈ తరహా వ్యవహారాలపై ఒకింత గుర్రుగానే ఉన్న మీనాక్షి… వీహెచ్ ఇంటిలో జరిగిన భేటీ తెలిసినంతనే ఆగ్రహం వ్యక్తం చేశారట.

కుల సంఘం సమావేశం ఏర్పాటు చేసుకున్న వీహెచ్ తీరుపై ఒకింత లోతుగానే పరిశీలన చేసిన మీనాక్షి… ఆదివారం వీహెచ్ ను పిలిపించుకుని మరీ క్లాస్ పీకారట. ఎంత కుల సంఘం సమావేశమైతే మాత్రం ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలను సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని ఆమె వీహెచ్ ను ప్రశ్నించార,ట. పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న మీరే ఈ తరహా చర్యలకు పాల్పడితే… ఇక యువతరం నేతలకు అడ్డుకట్ట వేయగలమా? అని కూడా ఆమె ఆయనను నిలదీశారట. మీనాక్షి ఆగ్రహంతో విస్తుపోయిన వీహెచ్ నోట నుంచి మాట కూడా పెగల్లేదట. మొత్తంగా వీహెచ్ ప్లాన్ రివర్స్ అయ్యిందన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.