పయ్యావుల పద్దు రూ.3.22 లక్షల కోట్లు… ఏఏ రంగాలకు ఎంతెంత..?

ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం ఉదయం తన తొలి వార్షిక బడ్జెట్ ను ప్రకటించింది. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. కూటమి సర్కారుకు ఇది తొలి వార్షిక బడ్జెట్ కాగా… ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ కు కూడా ఇది తొలి వార్షిక బడ్జెట్టే. మొత్తంగా రూ.3,22,359 కోట్ల భారీ బడ్జెట్ ను పయ్యావుల ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ లో రెవెన్యూ వ్యయాన్ని రూ.2,51,162 కోట్లుగా పేర్కొన్న పయ్యావుల… రెవెన్యూ లోటును రూ.33,135 కోట్లుగా ప్రకటించారు. ఇక మూలధన వ్యయాన్ని రూ.40,635 కోట్లుగా పేర్కొన్న మంత్రి… ద్రవ్య లోటును రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.

ఇక ఈ బడ్జెట్ లో ప్రధాన రంగాలకు ఏ మేరకు కేటాయించారన్న విషయానికి వస్తే,.. అందరూ ఊహించినట్లుగానే వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.48 వేల కోట్లు కేటాయించింది. ఇక ఆ తర్వాతి స్థానం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని పాఠశాల విద్యా శాఖకు దక్కింది. ఈ శాఖకు రూ.31,162 కోట్లను కేటాయించారు. వైద్య, ఆరోగ్య శాఖకు రూ.19,265 కోట్లను కేటాయించగా… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.18,848 కోట్లను కేటాయించారు. సాంఘీక సంక్షేమానికి రూ.10,909 కోట్లు కేటాయింపులు జరగగా… బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు కేటాయించారు.

ఇక సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు ప్రకటించిన మంత్రి పయ్యావుల… ఆ పథకం అమలు కోసం రూ.9,407 కోట్లను కేటాయించారు. అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వనున్న మరో సూపర్ సిక్స్ పథకాన్ని కూడా ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నామని చెప్పిన మంత్రి… ఈ పథకం అమలు కోసం రూ.6,300 కోట్లను కేటాయించారు. మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ పథకం కోసం రూ.2,601 కోట్లను కేటాయించారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు, రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.6 వేల కోట్లను కేటాయించారు. మొత్తంతా కూటమి ప్రాధమ్య రంగాలతో పాటుగా సూపర్ సిక్స్ పథకాలకు కూడా నిధులను కేటాయిస్తూ పయ్యావుల తన తొలి వార్షిక బడ్జెట్ లోనే అందరినీ ఆకట్టుకున్నారని చెప్పాలి.