బాబొచ్చారుగా… ‘గల్లా’ యాక్టివ్ అయ్యారు

గల్లా జయదేవ్.. ఈ పేరు విని చాలా రోజులే అయ్యింది అంటారా? నిజమే…గల్లా జయదేవ్ పేరు విని చాలా రోజులే అయ్యింది. తెలుగు నేలలో పారిశ్రామికంగా సత్తా చాటిన కుటుంబాల్లో ఒకటైన గల్లా ఫ్యామిలీ నుంచి వచ్చిన జయదేవ్.. ఇండస్ట్రియలిస్ట్ గా తనను తాను నిరూపించుకున్నారు. ఆపైై రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇచ్చి… వచ్చీరావడంతోనే గుంటూరు ఎంపీగా విజయం సాధించి చట్టసభల్లో అడుగు పెట్టేశారు. అయితే 2019లో ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు హయంలో ఏం జరిగిందో తెలియదు గానీ… రాజకీయాలతో పాటుగా పారిశ్రామికంగానూ జయదేవ్ చాలా కాలం పాటు అడ్రెస్ లేకుండాపోయారు. తాజాగా ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువుదీరగానే తిరిగి ఆయన యాక్టివ్ అయిపోయారు.

మొన్నటికి మొన్న దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడలతో కలిసి కనిపించి జయదేవ్ తన రీ ఎంట్రీని గ్రాండ్ గానే చూపించారు. దావోస్ సదస్సు ముగిసిందో.. లేదో… ఏపీలో జయదేవ్ ఓ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకున్నారు. 300 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్ ను నిర్మించే కాంట్రాక్టును జయదేవ్ నేతృత్వంలోని అమరరాజా ఇన్ ఫ్రా చేజిక్కించుకుంది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి వద్ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ చేపట్టే ఈ కేంద్రాన్ని నిర్మించి ఇచ్చే భారీ కాంట్రాక్టును అమరరాజా చేజిక్కించుకుంది. 1,100 ఎకరాల్లో విస్తరించే ఈ కేంద్రాన్ని అమరరాజా కేవలం ఒక్క ఏడాదిలోనే పూర్తి చేసి కేంద్రానికి అప్పగించనుంది. ఈ కేంద్రానికి అవసరమైన బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్స్, 220 కేవీ పూలింగ్ సబ్ స్టేషన్, 220 కేవీ వపర్ ట్రాన్స్ మిషన్ మౌలిక సదుపాయాలను అమరరాజా రికార్డు సమయంలో ఏర్పాటు చేయనుంది. ఇదిలా ఉంటే…ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత అన్న వివరాలు తెలియరాలేదు.