కిడ్నాప్ తర్వాత వంశీ ‘తాడేపల్లి’ వెళ్లారా..?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సంబంధించిన అంశాలు ఒక్కటొక్కటిగానే వెలుగులోకి వస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ పైనే గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ… ఆ తర్వాత అధికార పార్టీగా ఉన్న వైసీపీకి దగ్గరైపోయారు. జగన్ ఆదేశాలు జారీ చేశారో… లేదంటే జగన్ వద్ద మార్కులు కొట్టేయడానికి వంశీనే చేశారో తెలియదు గానీ… గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఆయన తన అనుచరులతో దాడి చేయించారు.

ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన టీడీపీ… తాను అధికారంలోకి రాగానే.. ఆ కేసును తిరగదోడింది. అయితే కేసు నుంచి బయటపడే దిశగా పావులు కదిపిన వంశీ… ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి.. బెదిరించి, డబ్బులు ఇస్తామని ఆశ చూపి కేసు విత్ డ్రా చేసుకునే దిశగా ఒప్పించారు.

సత్యవర్థన్ సోదరుడి ఫిర్యాదుతో వంశీపై కిడ్పాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు అనుమతితో మంగళవారం ఆయనను తమ కస్టడీలోకి తీసుకున్నారు. వరుసగా 3 రోజుల పాటు వంశీని పోలీసులు విచారించనున్నారు. ఇలాంటి సమయంలో వంశీకి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి… కేసు విత్ డ్రా చేసుకునే దిశగా అతడిని ఒప్పంచి… ఆపై అతడిని తన మనుషులతో విశాఖకు పంపించిన తర్వాత వంశీ ఒక్కరే… హైదరాబాద్ నుంచి నేరుగా తాడేపల్లి వెళ్లారట. తాడేపల్లిలో ఆయన జగన్ నివాసానికి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పక్కా ఆధారాలు అయితే పోలీసులకు ఇప్పటిదాకా లభించలేదు. విచారణలో భాగంగా వంశీ దీని గురించి చెబుతారా? లేదా? అన్నది వేచి చూడాలి.

సత్యవర్ధన్ ను విశాఖకు పంపిన తర్వాత వంశీ తన సెల్ ఫోన్ ను పలుమార్లు స్విచ్ ఆఫ్ చేసిన విషయాన్ని పోలీసులు గమనించారు. తన లొకేషన్ పోలీసులకు దొరకకుండా ఉండేందుకే వంశీ ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తన వ్యవహారాలను చక్కబెట్టుకున్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాస్తంత లోతుగా దర్యాప్తు చేయగా… హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి కారులో ఒంటరిగానే వంశీ బయలుదేరినట్లు పోలీసులకు ఫుటేజీ దొరికింది. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారన్నది తెలియరాలేదు.

అయితే విశ్వసనీయ సమాచారం మేరకు సత్యవర్ధన్ విషయంలో ఎలా ముందుకు సాగాలి అన్న దానిపై సలహాల కోసమే ఆయన తాడేపల్లి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వంశీ ఫొన్ లొకేషన్ ను ఎలాగైనా వెలికి తీసి ఈ సీక్రెట్ టూర్ గుట్టును విప్పేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు సమాచారం.