ఇలా కూడా జరుగుతుందా? అన్న ఆశ్చర్యానికి గురి చేసే ఉదంతం ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుంది. అక్కడ ఒక మంత్రిగారు ఉనికిలో లేని ఒక శాఖకు ఎంపికయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శాఖ అన్నది లేకున్నా.. అందులో గడిచిన 20 నెలలుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ తప్పిదాన్ని తాజాగా గుర్తించి నాలుకర్చుకున్న అధికారులు దాన్ని సవరించే పనిలో పడ్డారు. విన్నంతనే విచిత్రంగా అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..2022 మార్చిలో భగవంత్ మాన్ నేత్రత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే.
2023 మేలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా అప్పటివరకు వ్యవసాయం.. రైతు సంక్షేమ శాఖల్ని నిర్వహిస్తున్న కులదీప్ సింగ్ ధలివాల్ కు ఎన్ఆర్ఐ వ్యవహారాలు.. ఆడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ బాధ్యతల్ని అదనంగా అప్పగించినట్లుగా ప్రకటించారు. అయితే.. ఆడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ అన్నదే లేని విషయాన్ని ఇటీవల గుర్తించారు. అది కూడా సదరు మంత్రిగారు.. తన ఫోర్టుపోలియేకు సంబంధించిన శాఖకు ప్రధాన కార్యదర్శి లేకపోవటాన్ని గుర్తించి ఆరా తీశారు. ప్రభుత్వాన్ని వివరణ కోరారు. దీంతో.. జరిగిన తప్పును గుర్తించిన ప్రభుత్వం వెంటనే దిద్దుబాటుచర్యల్నిచేపట్టింది.
తాజాగా ఈ శాఖకు సంబంధించి గెజిట్ విడుదల చేశారు. దీనిపై బీజేపీ విమర్శలకు దిగింది. పంజాబ్ లో పాలన జోక్ గా మారిందని.. లేని శాఖకు 20 నెలలుగా మంత్రి ఎలా ఉన్నారు? అని ప్రశ్నిస్తోంది. ఉనికిలో లేని శాఖ గురించి ముఖ్యమంత్రికే తెలీదు.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. అయినా.. ఉనికిలో లేని శాఖకు తనను మంత్రిని చేశారన్న విషయం సదరు మంత్రికి 20 నెలలకు కానీ గుర్తించటం ఏమిటో కదా?
Gulte Telugu Telugu Political and Movie News Updates