తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల వివాదం రాజుకుంది. కృష్ణా జలాల్లో తన వాటాను ఇప్పటికే వాడేసుకున్న ఏపీ… తమకు చెందిన వాటాను కూడా దొంగచాటుగా వాడేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఆరోపణలతోనే సరిపెట్టని తెలంగాణ… ఈ ఏపీ నీటి చౌర్యాన్ని తక్షణమే ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలతో సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేయగా.. తమకు కొంత సమయం కావాలని ఏపీ కోరుతోంది. అయితే తెలంగాణ మాత్రం రోజుకు కొంత చొప్పున నీటి చౌర్యానికి పాల్పడుతున్న ఏపీ…కావాలనే సమావేశాన్ని వాయిదా వేస్తోందని, ఈ సాకుతో మరింత మేర నీటిని తరలించుకోవాలని చూస్తోందని వాదిస్తోంది.
సరే… ఏ రాష్ట్రమైనా తన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతూ ఉంటాయి. ఏపీలో ఈ వివాదంపై పెద్దగా రాజకీయమేమీ జరగడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెర లేసింది. ప్రదానంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ బరిలోకి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా మందే దిగిపోయారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, గుండకంట్ల జగదీశ్ రెడ్డిలు.. రేవంత్ రెడ్డి చేతగాని తనం వల్లే పొరుగు రాష్ట్రం తెలంగాణ వాటా నీటిని తరలించుకునిపోతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పేరునూ ప్రస్తావించిన జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సారి తెలంగాణలో వేలు పెట్టాలని చూస్తే చంద్రబాబును తన్ని తరిమేశామని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను నిలదీయాల్సింది పోయి… పొరుగు రాష్ట్రానికి చెందిన నేత మీద, నేరుగా సీఎం మీదే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏం లాభమని కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలించుకుని పోతూ ఉంటే.. రాష్ట్రంలోని అధికార పార్టీతో కలిసి పోరాటం చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దిశగా పోరు సాగించాలి గానీ…ఇలా తన్నుడు, తరిమేసుడు అంటూ ఊకదంపుడు వ్యాఖ్యలు ఇంకెన్నాళ్లు చెబుతారన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. అయినా గడచిన ఐదేళ్లలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఓ రేంజిలో పెంచేసి.. దానికి ఏకంగా రాయలసీమ అని పేరు పెట్టి…గుట్టు చప్పుడు కాకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించిన జగన్ ను … నాడు అధికారంలో ఉండి ఎందుకు అడ్డుకోలేకపోయారని కూడా చాలా మంది జగదీశ్ రెడ్డిని నిలదీస్తున్నారు.
అయినా పొరుగు రాష్ట్రంలో ఏ పార్టీ అదికారంలో ఉందన్న విషయాన్ని పక్కనపెట్టి… జల వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత అన్నిరాజకీయ పార్టీలపై ఉంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు గుర్తిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రంలో తనకిష్టమైన పార్టీ అధికారంలో ఉంటే ఒకలా, ఇష్టం లేని పార్టీ అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించే బీఆర్ఎస్ తమకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates