భారత పౌర విమానయాన రంగం ఓ రేంజిలో వృద్ధి చెందుతోంది. గడచిన పదేళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసిన భారత ఏవియేషన్ రంగం.. సమీప భవిష్యత్తులో మరింతగా విస్తరించనుంది. ప్రస్తుతం దేశంలో 157 విమానాశ్రయాలు ఉంటే… రానున్న ఐధేళ్లో వీటి సంఖ్య ఏకంగా 200 మార్కును దాటనుంది. రానున్న ఐదేళ్లలో కొత్తగా 50 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయని టీడీపీ యువనేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. గురువారం ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కార్యాయంలో పైలట్ల నమోదుకు సంబంధించిన నూతన వ్యవస్థ ఎలక్ట్రానిక్ పర్సనెల్ లైసెన్స్ ను ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేసిన రామ్మోహన్ నాయుడు.. సమీప భవిష్యత్తులో భారత్ లో 20 వేల మంది కొత్త పైలట్లు అవసరమవుతారని పేర్కొన్నారు. పౌర విమానయానంలో కొనసాగుతున్న వృద్ధే ఇందుకు కారణమని ఆయన అన్నారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విమానయాన ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పిన మంత్రి… అందుకు అనుగుణంగానే నూతన ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి నుంచి విమానాల రాకపోకలు కూడా భారీ ఎత్తున పెరగనున్నాయని చెప్పిన మంత్రి… అందుకు అవసరమైన మేర పైలట్లను కూడా సమకూర్చుకోవాల్సి ఉందన్నారు.
దేశీయ విమానయాన రంగంలో కొనసాగుతున్న వృద్ధికి అనుగుణంగా కొత్తగా 1,700 విమానాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి చెప్పారు. సివిల్ ఏవియేషన్ లో ఈ రీతిన కొనసాగుతున్న వృద్ధితో అంతర్జాతీయంగా కనెక్టివిటీ పెరగనుందన్నారు. కొత్తగా అందుబాటులోకి రానున్న విమానాలు, ఎయిర్ పోర్టుల నేపథ్యంలో కొత్తగా ఈ రంగంలో పైలట్ల సంఖ్య గణనీయంగా పెరగనుందని తెలిపారు. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని పైలట్ల నమోదు కోసం ఆన్ లైన్ సేవలు అందిస్తున్నామని… అందులో భాగంగానే 24 గంటలు అందుబాటులో ఉండే ఎలక్ట్రానిక్ పర్సనెల్ లైసెన్స్ ను ప్రారంభించామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సేవల్లో భాగంగా ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates