బాబుకు తోడుగా పవన్… నేరుగా రంగంలోకి జనసేనాని

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లగా… ఎన్డీఏలో మరో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత హోదాలో పవన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఢిల్లీ చేరిన పవన్… రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నేరుగా కార్యరంగంలోకి దిగిపోయారు. గురువారం చడీచప్పుడు లేకుండా ఆయన నేరుగా కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధికారిక నివాసంలో ప్రత్యక్షమయ్యారు. సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు.

ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వేదికగా ప్రకటించింది. ఢిల్లీ వెళ్లిన పవన్… గురువారం ఉదయం కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో భేటీ అయ్యారని… జల్ జీవన్ మిషన్ కార్యక్రమంపై వారి మధ్య చర్చ జరిగిందని జనసేన వెల్లడించింది. ఏపీకి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ఈ మిషన్ నిధులను అత్యధిక మొత్తంలో రాబట్టింది. అంతేకాకుండా వైసీపీ సర్కారు ఈ మిషన్ ను నిర్లక్ష్యం చేయడంతో పాటుగా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని పవన్ ఆధారాలతో సహా నిరూపించారు. తాజాగా ఈ మిషన్ ను మరింత కాలం పాటు పొడిగిస్తూ ఇటీవలే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఈ మిషన్ కింద మరింత మేర నిధులను రాబట్టే దిశగానే పవన్ కేంద్ర మంత్రితో సమావేశమైనట్టు సమాచారం.

ఇదిలా ఉంటే… ఢిల్లీకి ఏ పని మీద వెళ్లినా.. ఆ పనులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి నిధుల సాధన దిశగా చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలు రచించుకుని మరీ వెళతారని చెప్పుకున్నాం కదా. చంద్రబాబు మాదిరే పవన్ కూడా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఈ ఇద్దరు నేతలు తమ తమ వ్యూహాలు, ప్రణాళిలతో రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం గమనార్హం. ఇదే తరహా కృషితో రాష్ట్రం రానున్న ఐదేళ్లలో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధించడం ఖాయమేనని చెప్పక తప్పదు.