వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పుల పాపాలకు పరిహారంగా వడ్డీ రూపంలో తమ ప్రభుత్వం సుమారు 25 వేల కోట్లరూపాయలను చెల్లించిందని ఆయన పేర్కొన్నారు.
అదే ఆయన అప్పులు చేయకపోయి ఉంటే.. ఈ సొమ్మును ప్రజలకు పంచేవారి మని కూడా నారా లోకే పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో ఐదేళ్ల పాలన చేసిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని దుయ్యబట్టారు.
“రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అందినకాడికి అప్పులు చేశారు.
58 ఏళ్లపాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా… జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలానికి… అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ.24,944 కోట్లకు చేరింది. దీనిని తాజాగా చెల్లించాం“ అని నారా లోకేష్ పేర్కొన్నారు.
దీనిని బట్టి ఒక చెత్త ముఖ్యమంత్రిగా జగన్ ఎంత పేరు తెచ్చుకున్నారో అర్ధమవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు రూ.11వేల కోట్లు అధికంగా ఉందన్నారు.
జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే సొమ్ము ఉంటే.. తాము ప్రజలకు పంచే వారమని నారా లోకేష్ పేర్కొన్నారు.
కాగా.. ఇదే విషయాన్ని ఆదివారం సీఎం చంద్రబాబు కూడా పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని.. సుమారు 10 లక్షల కోట్లకు పైగానే అప్పులు చేయడంతో జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేశారని చెప్పారు. దీనికి వడ్డీలు కట్టేందుకే అప్పులు చేసే పరిస్థితికి తీసుకువచ్చారని ఆయన దుయ్యబట్టారు.
అయినా.. సంపద సృష్టించి.. ప్రజలకు పంచుతామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎనిమిది నెలల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలకు పైగానే పెట్టుబడులు సాధించినట్టు ఆయన తెలిపారు.