వైరల్ వీడియో : స్కూటర్ పై పాలమ్మిన మల్లారెడ్డి!

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి.. పేరు విన్నంతనే మస్త్ మజా వచ్చేస్తుంది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ, ఎన్నెన్నో వ్యాపారాల్లో కాలు పెట్టిన మల్లారెడ్డి.. అన్నింటా సక్సెస్ నే చవిచూశారు. ఆపై రాజకీయాల్లోకి వచ్చాక… అందులోనూ తన లెగ్ గోల్డెన్ లెగ్గేనని నిరూపించుకున్నారు.

ఆదిలో టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్నిమొదలుపెట్టిన మల్లారెడ్డి.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఏకంగా కేసీఆర్ కేబినెట్ లో మంత్రి కూడా అయ్యారు.. ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. 2023 ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్యేగా నెగ్గి రాజకీయాల్లో కూడా తనది ఉడుము పట్టేనని నిరూపించుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. మల్లారెడ్డి గురించి చాలానే ఉంది గానీ.. ఆదివారం పూట మల్లారెడ్డి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటారా? స్కూటర్ పై పాలు అమ్ముతూ మల్లారెడ్డి కనిపించి సందడి చేశారు. అది కూడా మెడలో దండలు, భుజాల చుట్టూ శాలువా కప్పుకుని మరీ ఆయన పాలు అమ్మిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించింది.

అదేంటీ.. మల్లారెడ్డి పాలు, పూలు అమ్మిన రోజులు పోయాయి కదా. ఇప్పటికీ ఆయన ఇంకా పాలు, పూలు అమ్ముతున్నారా?? అని అనుమాన పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఆయన స్కూటర్ పై పాలు అమ్మింది నిజం కాదు. అలా ఓ ఫోజు ఇచ్చారంతే.

సోషల్ మీడియాలో ఒకింత ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మల్లారెడ్డి… ఆదివారం బోడుప్పల్ లో ఏదో కార్యక్రమం ఉంటే.. దానికి హాజరయ్యేందుకు వెళ్లారట. ఈ సందర్భంగా అక్కడ ఓ వ్యక్తి పాల క్యాన్లను స్కూటర్ పై పెట్టుకుని వెళ్లడాన్ని మల్లారెడ్డి గమనించారు.

ఇంకేముంది… తన పాత రోజులు ఆయనకు గుర్తుకు వచ్చినట్టున్నాయి. వెంటనే సదరు వ్యక్తిని నిలిపి… అతడిని స్కూటర్ పై నుంచిదించి.. పాల క్యాన్లు ఉన్న సదరు స్కూటర్ పై ఎక్కిన మల్లారెడ్డి అలా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత స్కూటర్ దిగి తన భుజాల చుట్టూ ఉన్న శాలువా తీసి ఆ వ్యక్తిని సన్మానించి అలా వెళ్లిపోయారు.