బాబు ముందు అధికారులను బుక్ చేసిన బాలిక

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర పేరిట ఇటీవలే ప్రారంభించిన కార్యక్రమంలో చంద్రబాబు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన చంద్రబాబు… పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రతను పరికించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

కందుకూరులో పరిశుభ్రతపై మాట్లాడేందుకు వచ్చిన ఓ బాలిక… చంద్రబాబు సమక్షంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పట్టణంలో పరిశుభ్రత గురించి మాట్లాడిన బాలిక… పట్టణంలో పరిశుభ్రతను అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపింది. చంద్రబాబు వస్తున్నారని.. శనివారం ఉదయమే అధికారులు పట్టణంలోని చెత్తను తొలగించారని ఆ బాలిక తెలిపింది. అదే చంద్రబాబో, లేదంటే ఇతర ముఖ్య నేతల పర్యటనలు లేకుంటే.,..పట్ఠణంలో చెత్త తొలగింపును యంత్రాంగం అస్సలు పట్టంచుకోవట్లేదని కూడా ఆ బాలిక వెల్లడించింది.

వాస్తవానికి చంద్రబాబు పచ్చదనం-పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. తాను ఎప్పుడు సీఎంగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో బాబు పచ్చదనం-పరిశుభ్రత కాస్తా… స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రగా మారినా.. లక్ష్యం మాత్రం పాతదే.

చంద్రబాబు ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ఈ పథకంలో అధికారులు ఎంతగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విషయాన్ని కందుకూరు బాలిక సభా ముఖంగానే కుండబద్దలు కొట్టింది. బాలిక మాటలు విన్న చంద్రబాబు… కందుకూరు మునిసిపల్ అధికారుల పనితీరుపై మదింపు చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.