రాహుల్ తో రేవంత్ భేటీ… గంటలో ఏం చర్చించారంటే?

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి… శనివారం మధ్యాహ్నం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం 10 .జన్ పథ్ లో సాగిన వీరి భేటీ దాదాపుగా గంటపాటు కొనసాగింది. తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం.

ఇటీవలే తెలంగాణలో జరిగిన కుల గణణపై రాహుల్ కు రేవంత్ ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే దిశగా ఆలోచన చేస్తున్నామని… అందుకు పార్టీ నుంచి అనుమతి కావాలని కూడా రాహుల్ ను రేవంత్ కోరినట్లు సమాచారం.

అంతేకాకుండా పీసీసీ పునర్వ్యవస్థీకరణపైనా కీలక చర్చే జరిగిందట. ఇక వాయిదా పడ్డ కేబినెట్ విస్తరణపై నేతలిద్దరూ చర్చించినట్లు సమాచారం. అయితే కేబినెట్ విస్తరణపై రాహుల్ పెద్దగా ఆసక్తి చూపలేదని, ఇంకొంత సమయం గడచిన తర్వాత చూద్దాంలే అన్నట్లు తెలుస్తోంది.

ఇక టీపీసీసీ ఇంచార్జీగా దీపాదాస్ మున్షిని ఆ పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్ పార్టీ… ఆ ప్లేస్ లో రాహుల్ కోర్ టీంలో అత్యంత ప్రతిభావంతురాలుగా పేరు తెచ్చుకున్న మీనాక్షీ నటరాజన్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాహుల్ తో రేవంత్ ఒకింత లోతుగానే చర్చించినట్లు సమాచారం.

రాహుల్ కు మీనాక్షి అత్యంత నమ్మకస్తురాలు అయిన నేపథ్యంలో ఆమెకు మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా ఆమె సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు సాగనున్నట్లు రాహుల్ కు రేవంత్ చెప్పినట్లు సమాచారం. మొత్తంగా ఇటీవలి ఢిల్లీ టూర్ లో రాహుల్ అపాయింట్ మెంట్ లభించని రేవంత్ కు ఈ దఫా ఢిల్లీ వెళ్లిన మరునాడే రాహుల్ తో భేటీ కావడం ప్రాదాన్యం సంతకరించుకుంది.