మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో కూటమి పాలన మొదలయ్యాక జరుగుతున్న పరిణామాలపై వైరి వర్గాలు విస్తుపోయే రీతిలో ఆరోపణలు గుప్పిస్తున్న వైనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో పాలన సవ్యంగా సాగిందని చెబుతున్న ఆ పార్టీ నేతలు.. కూటమి పాలనలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ తప్పులేనని వాదిస్తున్నారు.
ఇందుకు న్యాయం, చట్టం, రాజ్యాంగం అంటూ భారీ డైలాగులు చెబుతున్నారు. అయితే సదరు ఆరోపణలకు కూటమి సర్కారు నుంచి కూడా గట్టిగానే బదులు వస్తోంది. తాజాగా వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ సందర్భంగానూ వైసీపీ నుంచి విసుర్లు వస్తూ ఉంటే.. వాటిని కూటమి నేతలు తిప్పి కొడుతున్నారు.
వంశీ అరెస్ట్ పై వైసీపీ వరుసబెట్టి చేస్తున్న విమర్శలపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం స్పందించారు. ఈ అంశంపై స్పందంచేందుకు మీడియా ముందుకు వచ్చినంతనే ఆమె ఓ డేరింగ్ పంచ్ ను సంధించారు. వైసీపీ హయాంలో జరిగిన అరెస్టులన్నీ సక్రమమని, కూటమి పాలనలో జరుగుతున్న అరెస్టులన్నీ అక్రమమని చూపే యత్నలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు.
వైసీపీ అరెస్టులు సక్రమం అయితే… టీడీపీ అరెస్టులు అక్రమం ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించారు. నాటి అరెస్టులు సక్రమమే అయితే… నాటి అరెస్టులపై తాము డీజీపి కలిసేందుకు వస్తే.. కనీసం తమను డీజీపీ కార్యాలయం గేటు కూడా తాకనివ్వలేదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాటి పాలనా తీరును పరిశీలిస్తే.. టీడీపీ హయాంలో నీతి నిజాయతీతో కూడిన పాలన సాగుతోందని ఆమె చెప్పారు. తాము వైసీపీలాగా కక్షపూరిత రాజకీయాలు చేయదలచుకుంటే… తమ పార్టీ అధినేతపై వంశీ చేసిన వ్యాఖ్యలతో ఆయనను ఎప్పుడో బొక్కలో వేసేవారమన్నారు.
తమను, తమ అదినేతను ఎంతలేసి మాటలన్నా కూడా వంశీని… కేసులో పక్కా ఆధారాలు లభించేదాకా అరెస్టే చేయలేదన్నారు. వంశీ దుర్మార్గాలకు పాల్పడ్డారని పక్కా ఆధారాలు లభించిన తర్వాతే ఆయనను అరెస్ట్ చేశామన్నారు. వంశీ అరెస్ట్ ను పరికిస్తే… కర్మ సిద్ధాంతం తనకు గుర్తుకు వస్తోందని, కర్మ సిద్ధాంతం పనిచేస్తోందని కూడా రుజువు అయ్యిందని ఆమె వ్యాఖ్యానించారు.