మ‌హానాడు పేరు మార్చేసిన వైసీపీ, బాబు షాక్

మ‌హానాడు- టీడీపీ ఏటా నిర్వ‌హించుకుని ప‌సుపు పండుగ‌. అయితే.. ఈ పేరుతో విజ‌య‌వాడ‌లో ఓ రోడ్డు ఉంది. దీనిపై తాజాగా సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో విజ‌య‌వాడ ఆటోన‌గ‌ర్ ప‌రిధిలో మ‌హానాడును నిర్వ‌హించారు. అప్ప‌ట్లో పెద్ద‌గా ఇక్క‌డ అభివృద్ధి లేదు. దీంతో ఖాళీ స్థ‌లాలు ఎక్కువ‌గా ఉండేవి. భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చే తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌కు అనుకూలంగా ఉంటుంద‌ని భావించి.. ఈ ఖాళీ స్థ‌లాల్లోనే మ‌హానాడుకు శ్రీకారం చుట్టారు.

కాల క్ర‌మంలో ఈ రోడ్డుకు మ‌హానాడు రోడ్డుగా పేరు వ‌చ్చింది. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ కూడా.. దీనిని గుర్తించింది. మ‌హానాడు రోడ్డుగానే రికార్డుల్లో కూడా ఉంది. అయితే.. వైసీపీ హ‌యాంలో రాజ‌కీయ వ్యూహం ప్ర‌కారం.. టీడీపీకి సంబంధించిన మ‌హానాడు కార్య‌క్ర‌మం జ‌రిగింది కాబ‌ట్టి.. మ‌హానాడు అనే పేరు వ‌చ్చింద‌ని.. కాబ‌ట్టి దీనిని తీసేయాల‌ని నిర్ణ‌యించింది. దీనివెనుక వైసీపీ యువ నాయ‌కుడు.. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ పాత్ర కీల‌కంగా ఉంది. ఆయన ఇంచార్జ్‌గా ఉన్న తూర్పునియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే ఈ ర‌హ‌దారి కూడా ఉండ‌డంతో ఆయ‌న ఒత్తిడి తెచ్చారు.

అవినాష్‌తో ఉన్న రాజ‌కీయ ప‌ర‌మైన అంశాలు.. టీడీపీ పై ఉన్న క‌క్ష కార‌ణంగా.. వైసీపీ ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ లేకుండా..(ర‌హ‌దారుల పేర్లు మార్చేందుకు ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ తీసుకోవాల‌నేది నిబంధ‌న‌. పెట్టాల‌న్నా కూడా అలానే ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు) రాత్రికి రాత్రి మ‌హానాడు పేరును మార్చేశారు. దీనికి మాజీ మంత్రి.. దేవినేని రాజ‌శేఖ‌ర్ ఉర‌ఫ్ దేవినేని నెహ్రూ పేరును జోడించారు. అప్ప‌టి నుంచి రికార్డుల్లోనూ మార్చేశారు. అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విన‌తులు వ‌చ్చాయి. ఈ ర‌హ‌దారి పేరును.. మ‌హానాడుగానే ఉంచాల‌ని కోరారు.

దీనికి తోడు.. స్థానికంగా కూడా.. ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కూడా ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రించి.. ప్ర‌భుత్వానికి పంపించారు. దీనిని ప‌రిశీలించిన చంద్ర‌బాబు తొలుత ఆశ్చ‌ర్య పోయారు. అనంత‌రం.. మ‌హానాడు పేరు మార్చ‌డానికి వీల్లేద‌ని పేర్కొంటూ.. శ‌నివారం ఉత్త‌ర్వులు స్వ‌యంగా జారీ చేశారు. ఇక నుంచి మ‌హానాడు పేరుతోనే ర‌హ‌దారిని కొన‌సాగించాల‌ని పేర్కొన్నారు. వైసీపీ ప్ర‌భుత్వం ఇంత చిన్న విష‌యాల‌ను కూడా రాజ‌కీయం చేసింద‌ని.. ద‌రిద్రుల పాల‌న ఇలానే ఉంటుంద‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.