ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పాలుపంచుకున్నారు. మంగళవారం నాటి లోక్ సభ సమావేశాల్లో భాగంగా తనకు అవకాశం రాగా… మిథున్ రెడ్డి సుదీర్ఘంగానే ప్రసంగించారు. ఈ సందర్భంగా రాస్ట్రపతి ప్రస్తావించిన పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన కీలక అంశాలను లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని తెలిపారు. ఎత్తు తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా…ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసిన విషయాన్ని మిథున్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా తమ పార్టీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన సీబీఎస్ఈని కూడా రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు పేద పిల్లలకు విద్యనందించే సర్కారీ బడుల్లో వైసీపీ ప్రభుత్వం భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. అయితే ఇప్పుడు అధికారం చేపట్టిన కూటమి సర్కారు ఆంగ్ల మాధ్యమంతో పాటుగా సీబీఎస్ఈని రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృస్టిలో పెట్టుకుని తక్షణమే ఏపీలోని సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

మిథున్ రెడ్డి ప్రసంగం విన్నంతనే…ఆయన తీరుపై సెటైర్ల వర్షం మొదలైపోయింది. ఏ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాలో కూడా తెలియని మీరు ఎంపీ ఎలా అయ్యారంటూ ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయినా ఏపీలో ఎలాంటి విద్యను అందించాలన్నది అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన విషయం. దాని గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తే ఏం లాభం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించిన లోక్ సభ విలువైన సమయాన్ని మిథున్ రెడ్డి వృథా చేస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

ఏపీలో అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న సాకుతో అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లుగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను ప్రకటించినట్లుగానే జగన్ తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన మిథున్ రెడ్డి… అసెంబ్లీ అయితేనేం… పార్లమెంటు అయితేనేం… ఏపీ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి ప్రస్తావిస్తే సరిపోలా అన్నకోణంలో ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించారన్న కోణంలో సెటైర్లు పడుతున్నాయి.