1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో తొలి సారి ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు… సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు. అసలు అప్పటిదాకా సుపరిపాలన అంటే ఏమిటో తెలియదు. అసలు ఆ పదమే మెజారిటీ ప్రజలకు తెలియదు. ఉన్నత విద్యావంతులకు ఈ, పదం తెలిసినా… పెద్దగా అవగాహన అయితే లేదు. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటుగా కేంద్రం కూడా సుపరిపాలన బాటలోనే పయనిస్తున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా టీడీపీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేతల అభ్యర్థనతో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగిన చంద్రబాబు… బీజేపీ అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్… చంద్రబాబు వెంటే సాగుతున్నారు. ఢిల్లీ చంద్రబాబు ప్రచారం ఏర్పాట్ల బాధ్యతలను భుజానికెత్తుకున్న ఖట్టర్… అనుక్షణం చంద్రబాబు వెంటే నడుస్తున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని ఖట్టర్ గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టక ముందు ఖట్టర్ హర్యానాకు ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేసిన ఖట్టర్…2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి… వచ్చీ రావడంతోనే హర్యానా సీఎం పదవిని దక్కించుకున్నారు. ఈ లెక్కన ఖట్టర్ కు పాలిటిక్స్ పై మంచి పట్టే ఉన్నా… పాలనపై అంతగా పట్టు లేదనే చెప్పాలి. ఆ సమయంలో విభజిత ఏపీకి సీఎంగా చంద్రబాబు ఉన్నారు. పాలనలో తర్వాతి తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు దూసుకుపోతున్నారు.
పాలనపై అవగాహన పెంచుకునే మార్గాలను వెతికిన ఖట్టర్… చంద్రబాబు సుపరిపాలనను గురించి తెలుసుకుని ఇంప్రెస్ అయ్యారు. వెంటనే తన ప్రతినిధి బృందాన్ని ఏపీకి పంపించి… చంద్రబాబు అందిస్తున్న సుపరిపాలనపై అధ్యయనం చేయించారు. ఆ తర్వాత అవే సంస్కరణలను అమలు చేస్తూ… ఖట్టర్ కూడా చంద్రబాబు మాదిరే హర్యానాలో సుపరిపాలనను అందించారు. ఫలితంగా బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. కేంద్ర మంత్రిగా ప్రమోట్ అయ్యారు. శనివారం చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టినంతనే ఈ విషయాలన్నీ గుర్తు చేసుెకున్న ఖట్టర్… వాటన్నింటినీ ఇంటరెస్టింగ్ గా వివరిస్తూ సాగారు.