ఒక్కొక్కటిగా కాదు… మూడింటిని ముడేసి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ఇప్పటిదాకా అవాకులు చెవాకులు పేలుతున్న విపక్షాలకు ఇక మాట పెగలకుండా ఉండేలా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా కాకుండా బండిల్ గానే అమలు చేసే దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంచలన నిర్ణయానికి శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం వేదికగా నిలిచింది.

వైసీపీ పాలనలో నాటి సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేయడంతో పాటుగా కూటమి సర్కారుకు ఖాళీ ఖజానాను అప్పగించి వెళ్లిపోయారు. దీంతో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు నిధుల లభ్యత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. పరిస్థితిని ప్రజలకు వివరిస్తూనే… సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా సాగుదామని నిన్నటిదాకా చంద్రబాబు భావించారు. అయితే కేంద్రం నుంచి అందుతున్న దన్నుతో… క్రమంలో రాష్ట్రంలో పెరుగుతున్న ఆదాయంతో చంద్రబాబు తన రూటును మార్చేశారు.

సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా కాకుండా ఒకదానికి మరో దాన్ని జత చేసి మరీ అమలు చేద్దామన్న ధీమా చంద్రబాబులో వచ్చేసింది. అందుకు అనుగుణంగానే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. జూన్ లోగా సూపర్ సిక్స్ లోని ప్రధానమైన 3 హామీలను అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. తొలుత తల్లికి వందనం పథకాన్ని పాఠశాలలు తెరిచేలోగానే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాదిరిగానే… పాఠశాలల్లో ఎంత మంది పిల్లలు ఉంటే… అంత మందికి రూ.15 వేల చొప్పున అందించాలని నిర్ణయించారు.

ఇక అన్నదాతా సుఖీభవ కింద రైతులకు హామీ ఇచ్చిన మేరకు రూ.20 వేలను అందించేందుకు కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎలాగూ కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ నిధులకు మిగిలిన మొత్తాలను కలిపి జూన్ లోగానే ఈ పథకాన్ని అమలు చేయాలని తీర్మానించారు. అదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా జూన్ లోగానే అమలు చేసి తీరాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. అంటే… ఈ జూన్ లోగా ఒకేసారి ఏకంగా సూపర్ సిక్స్ లోని 3 కీలక హామీలు పట్టాలు ఎక్కబోతున్నాయన్న మాట. అదే జరిగితే… వైసీపీ నోట నుంచి గానీ, ఆ పార్టీ అధినేత జగన్ నోట నుంచి గానీ విమర్శ అనే మాటే వినిపించదన్న వాదనలు వినిపిస్తున్నాయి.