జ‌గ‌న్ అతివిశ్వాసం.. కొంప ముంచేస్తుందా?

అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్‌.. అనేది సామెత కాదు.. నిజం అంటారు పెద్ద‌లు. వ్య‌క్తుల జీవితాల్లో అయినా.. రాజ‌కీయ నేత‌ల్లో అయినా.. పార్టీల‌కైనా.. అతి ఎక్క‌డా ప‌నిచేయ‌ద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో అతిగా ప్ర‌చారం చేసుకున్న చంద్ర‌బాబు.. చివ‌రికి ఏమ‌య్యారో.. అంద‌రికీ తెలిసిందేన‌ని అంటున్నారు. అదేవిధంగా ఇత‌ర పార్టీలతోనూ ఆయ‌న అతిగానే చె‌ట్టాప‌ట్టాలే సుకుని ముందుకు సాగార‌ని, అతిగానే న‌మ్మార‌ని ఇవ‌న్నీ.. ఆయ‌న‌కు ఎక్క‌డా ప‌నిచేయ‌క‌పోగా.. చివ‌రికి ఆయ‌నే బోనులో నిల‌బ‌డాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు. ఇది పార్టీకి, వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబుకు కూడా ఇబ్బంది క‌లిగించింద‌ని అంటున్నారు. ఇన్ని ఉదాహ‌ర‌ణలు క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్నా.. వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం.. ఇటీవ‌ల కాలంలో అతిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

అన్ని విధాలా ఆయ‌న‌లో అతి క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ప‌థ‌కాలు అమ‌లు చేయొచ్చు..కానీ, అన్నీ పంప‌కాల‌తో కూడిన ప‌థ‌కాలే కావ‌డం అతికాదా? అనేది విశ్లేష‌కుల మాట‌. నిధులు పంచే ప్రోగ్రాం అయినా.. ఒక‌టి రెండు ఉంటే త‌ప్పులేద‌ని అతిగా చేయ‌డం వ‌ల్ల రాష్ట్రం ఆర్థికంగా స‌త‌మ‌తం కావ‌డం, అప్పుల్లో కూరుకుపోవ‌డం క‌నిపించ‌డం లేదా? అనేది వీరి సూటి ప్ర‌శ్న‌. ఇక‌, అతి మౌనం.. కూడా జ‌గ‌న్‌ను ఇబ్బంది పెడుతోంద‌న్న‌ది వీరి హెచ్చ‌రిక‌.

గతంలో చంద్ర‌బాబు నిత్యం మీడియాలో ఉండ‌డం ఎంత అతి అనిపించిందో.. ఇప్పుడు అస్స‌లు మీడియా జోలికే రాను.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండ‌ను అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం కూడా అంతే అతిగా అనిపిస్తోంద‌ని.. ఇది అంతిమంగా ఆయ‌న‌కే న‌ష్ట‌మ‌ని.. ప్ర‌జ‌ల‌కు నిజాలు తెలిసేలోగా.. అబ‌ద్దాలు వెయ్యి రెట్ల వేగంతో వెళ్లిపోతున్నాయ‌ని.. అయినా.. జ‌గ‌న్ మౌనంగానే ఉండ‌డం స‌మ‌ర్థ‌నీయం కాద‌ని అంటున్నారు.

ఇక‌, గ‌తంలో చంద్ర‌బాబు కూడా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు జుట్టూ జుట్టూ ప‌ట్టుకుని కొట్టుకున్నా.. మౌనం పాటించారు. అతి క్ర‌మ శిక్ష‌ణ పేరుతో వారితో మాట్లాడేందుకు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు జ‌గ‌న్ చేస్తోంది కూడా ఇదేనంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు పార్టీ నేత‌ల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఆధారాల‌తో స‌హా వెలుగు చూస్తున్నా.. ఆయ‌న మౌనం పాటిస్తున్నారు. అస‌లేమీలేద‌న్న‌ట్టుగా ఉన్నారు. పోనీ.. ఏమీ లేన‌ప్పుడు అదే విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెబితే.. ఇలాంటివాటికి బ్రేకులు ప‌డ‌తాయి క‌దా! అనేది విశ్లేష‌కుల అభిప్రాయం. అయినా.. జ‌గ‌న్ మాత్రం త‌న‌నుతాను అతిగానే ఊహించుకుంటున్నార‌ని అంటున్నారు.

మ‌రో ముఖ్య‌విష‌యం.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు డిస్టెన్స్ మెయింటెన్ చేసి.. ఎంత వ‌ర‌కు ఉండాలో అంతే.. ఉన్న జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం అతి చేస్తున్నార‌ని… త‌న జుట్టును తీసుకువెళ్లి కేంద్రం పెద్ద‌ల చేతికి అందిస్తున్నారని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాష్ట్రంలో ఏ లోపాలు ఉన్నా.. ఎన్ని విమ‌ర్శ‌లు ఉన్నా.. రాష్ట్రాధినేత‌గా ఆయ‌నే ప‌రిష్క‌రించుకుంటే.. అప్పుడు ఉండే గౌర‌వం వేర‌ని.. కానీ, ప్ర‌తి విష‌యానికీ.. కేంద్రం వ‌ద్ద పంచాయితీ పెట్టుకుని, ఇక్క‌డి త‌న లోపాల‌ను కూడా అక్క‌డ చ‌ర్చించుకునేలా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల అంతిమంగా న‌ష్ట‌పోయేది జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీనేని అంటున్నారు. బీజేపీని అతిగా న‌మ్మిన నాయ‌కులు.. పార్టీలు.. లాభించింది ఏమీలేద‌ని.. అంత లాభ‌మే ఉంటే.. బీజేపీ చూస్తూ ఊరుకోద‌ని.. అంటున్నారు.