మళ్ళీ ఢిల్లీకి వెళుతున్న జగన్..పెరిగిపోతున్న టెన్షన్

జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నారు. గడచిన 20 రోజుల్లో జగన్ ఢిల్లీకి వెళ్ళటం ఇది మూడోసారి. మొదటిసారి ఢిల్లీకి వెళ్ళిన జగన్ రెండు రోజుల్లో రెండుసార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. తర్వాత వారం రోజులకే పిలుపు రావటంతో మళ్ళీ దేశ రాజధానికి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయ్యారు. దాదాపు 50 నిముషాల పాటు జరిగిన భేటిలో కీలక విషయాలు మాట్లాడుకున్నట్లు ప్రచారం జరిగింది కానీ అవేమిటో మాత్రం బయటకు రాలేదు.

అయితే ఢిల్లీ నుండి తిరిగి రాగానే సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు ఆరుగురు జడ్జీలు, చంద్రబాబునాయుడు, మాజీ అడ్వకేట్ జనరల్ పై జగన్ ఫిర్యాదులు చేస్తు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకు రాసిన లేఖ దేశంలోనే సంచలనంగా మారింది. న్యాయ, రాజకీయ ప్రముఖులపై జగన్ చేసిన ఫిర్యాదు దాదాపు 19 జాతీయ ఇంగ్లీషు దినపత్రికల్లో వచ్చిందంటేనే విషయం ఎంత సంచలనమైందో అర్ధమైపోతుంది.

జగన్ ఫిర్యాదు విషయం వెలుగు చూడగానే పాజిటివ్ , నెటిగివ్ గా చర్చల జోరు పెరిగిపోతోంది. న్యాయవ్యవస్ధలోని నిపుణుల్లో కొందరు జగన్ చేసిన ఫిర్యాదుకు మద్దతుగా మాట్లాడుతుంటే మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా వస్తోంది. మొత్తం మీద జగన్ ఫిర్యాదు పర్యవసానం ఎలాగుంటుందో ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తం మీద జగన్ ఢిల్లీ పర్యటనగానే రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఇటువంటి నేపధ్యంలోనే జగన్ మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నారంటేనే విషయం ఏదో చాలా సీరియస్ గా ఉందనే అనిపిస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడి అపాయిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. వాళ్ళ ఆఫీసుల నుండి కబురు రావటం ఆలస్యం వెంటనే ఢిల్లీకి వెళ్ళటానికి జగన్ రెడీగా ఉన్నారట. ఇపుడు గనుక ముఖ్యమంత్రి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారంటే నిజంగానే దశం దృష్టి యావత్తు జగన్ పర్యటనపైనే ఉంటుందనటంలో సందేహం లేదు.