మొదలైన జగన్ కేసులపై రోజువారీ విచారణ..మొత్తం 16 కేసులు

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణను శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ మొదలుపెట్టింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను స్పీడు చేయాలని, వీలైనంత తొందరలో పరిష్కరించాలన్నసుప్రింకోర్టు ఆదేశాల కారణంగానే హైకోర్టు దానికి తగ్గ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ఇఫ్పటికే సీబీఐ, ఈడి చర్టుల్లో ఉన్న జగన్ కేసుల విచారణ కూడా వేగవంతమైంది. జగన్ పై నమోదైన 11 కేసులను సీబీఐ కోర్టు, ఈడి కోర్టులో ఉన్న మరో 5 కేసులను ఇక నుండి రోజువారి విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

తాజా విచారణలో జగన్ తరపు లాయర్ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా రానున్న దసరా పండుగ తర్వాత రోజు వారి విచారణ చేయాలని అప్పటి వరకు వాయిదా వేయాలని అభ్యర్ధించారు. అదే సమయంలో విచారణను భౌతికంగా కాకుండా ఆన్ లైన్లో విచారణ చేయాలన్నారు. సీబీఐ కోర్టు హాలు చాలా చిన్నదని లాయర్లు, సాక్ష్యులు, ఇతర జనాలు ఇంతమంది కోర్టు హాలులో పట్టరు కాబట్టే తాము ఆన్ లైన్లో విచారణ జరపాలని అడుగుతున్నట్లు చెప్పారు. అయితే దసరా తర్వాత విచారణ సాధ్యం కాదని కొట్టేశారు. ఇక ఆన్ లైన్లో విచారణ విషయాన్ని పరిశీలిస్తామని మాత్రం చెప్పారు.

మొత్తం మీద ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏదో ఓ కారణంగా విచారణను మరికొద్ది రోజులు వాయిదా వేయిద్దామని జగన్ తరపు లాయర్ చేసిన ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుంది. ఎంపిలు, ఎంఎల్ఏలపై నమోదైన కేసులను రోజువారి విచారణ చేపట్టాలని సుప్రింకోర్టు ఎక్కడా ఉత్తర్వులు ఇవ్వలేదని లాయర్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను రోజు వారి విచారణ చేయాలని సుప్రింకోర్టు పదే పదే ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. చట్టసభల్లో నేరచరితులు ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతోనే సుప్రింకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రజా ప్రతినిధులపై ఏపిలో సుమారు 150 మందిపై కేసులున్నాయి. ఇందులో తాజా, మాజీ ఎంఎల్ఏల, ఎంపిలున్నారు. వీరిలో అత్యధికులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనల కేసులు కూడా ఉన్నాయి. వీటిని కోర్టు తన విచారణలో ఎలాగూ కొట్టేస్తుంది. అయితే జగన్, చంద్రబాబునాయుడు, సుజనా చౌదరి, రఘురామకృష్ణంరాజు, సీఎం రమేష్, అచ్చెన్నాయుడు లాంటి కొందరిపైన మాత్రం అవినీతి, అక్రమాస్తుల సంపాదన లాంటి పెద్ద కేసులున్నాయి. సుప్రింకోర్టు చెప్పినట్లుగా రోజువారి విచారణ జరిగి కేసులను తేల్చేస్తే రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరగటం ఖాయమనే అనిపిస్తోంది.