క్లైమాక్స్ కు చేరుకుంటున్న ప్రభుత్వ-కోర్టు మధ్య వివాదం..స్పీకర్ పై చర్యలు?

కొంతకాలంగా ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య మొదలైన వివాదం చివరకు క్లైమ్యాక్సుకు చేరుకుంటున్నదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కోర్టులపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపిలు నందిగం సురేష్ తో పాటు మాజీ ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ పై ఎందుకు కేసులు నమోదు చేయలేదని హైకోర్టు సీఐడి అధికారులను సూటిగా ప్రశ్నించింది. హైకోర్టుపై వీళ్ళు చేసిన వ్యాఖ్యలును న్యాయస్ధానంపై దాడిగానే పరిగణించాల్సుంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే వీళ్ళ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగిస్తున్నట్లు అభిప్రాయపడింది.

స్పీకర్ ఆమధ్య మాట్లాడుతు కోర్టు తీర్పులపై ప్రజలే తిరగబడే రోజు వస్తుందన్నారు. అనవసర విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని, అవినీతికి పాల్పడినా కూడా ఎవరిమీద విచారణ చేయటానికి లేదంటు కోర్టులు స్టే ఇవ్వటం ఏమిటంటూ మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఏసిబి విచారాణపై కోర్టు స్టే ఇవ్వటంపై స్పీకర్ మాట్లాడారు. జనాలు గనుక రోడ్లపైకి వస్తే అప్పుడు ప్రళయం వస్తుందంటూ స్పీకర్ హెచ్చరించారు. కాస్త అటు ఇటుగానే మిగిలిన ముగ్గురు కూడా కోర్టులపై ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపైనే విచారణ సందర్భంగా గురువారం కోర్టు పై నలుగురిపై తీవ్రంగా మండిపడింది.

ప్రభుత్వం మీద విమర్శలు చేసిన వారిపై వెంటనే కేసులు పెడుతున్న పోలీసులు… న్యాయస్ధానం, న్యాయమూర్తులపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ సూటిగా నిలదీసింది. పై నలుగురిపై హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినా ఎందుకు ఇంతవరకు కేసులు పెట్టలేదంటూ మండిపడింది. ఇప్పటివరకు కేసులు పెట్టలేదంటే వాళ్ళని రక్షించటానికేనా అని నిలదీసింది. హైకోర్టుపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో చేశారా ? లేకపోతే బయట చేశారా ? అంటూ వాకబు చేసింది. తిరుమల కొండపై స్పీకర్ వ్యాఖ్యలు చేశారని స్టాండింగ్ కౌన్సిల్ చెప్పగానే హైకోర్టులపై యుద్ధం ప్రకటించినట్లే ఉందని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.

కేసుల నమోదు, విచారణలో సీఐడి విఫలమైతే సీబీఐతో విచారణ జరిపించాల్సుంటుందని కూడా సీఐడి ఉన్నతాధికారులను తీవ్రంగా హెచ్చరించింది. ఇదే సందర్భంగా మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపిలో మాత్రమే ప్రభుత్వం-హైకోర్టు మధ్య వివాదాలు తలెత్తుతున్నట్లు చెప్పింది. మరి హైకోర్టు ఆదేశాలతో సీఐడి పోలీసులు గనుక అసెంబ్లీ స్పీకర్ పై కేసు నమోదు చేస్తే ఎటువంటి పరిస్ధితులు తలెత్తుతాయో చూడాల్సిందే.