జగన్ కేసులపై విచారణ స్పీడందుకుంటుందా ?

ఆదాయానికి మించిన ఆక్రమాస్తులున్నాయని నమోదైన కేసుల్లో జగన్మోహన్ రెడ్డిపై శుక్రవారం ఈడీ కోర్టులో విచారణ జరుగుతుందా ? ఈ అంశంపై అందరిలోను ఉత్కంఠ మొదలైంది. నేరచరితులైన ప్రజా ప్రతినిధులపై రోజువారీ విచారణలు జరగాలంటూ హైకోర్టు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే రెగ్యులర్ కోర్టులోనే జగన్ కు సంబంధించిన అనేక కేసులు వివిధ కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు కొన్ని కేసుల విచారణ జరగబోతున్నాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధిని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టిన తర్వాత అప్పట్లో జగన్ పై ఒక్కసారిగా కేసులు నమోదయ్యాయి. విచారణ పేరుతో సీబీఐ జగన్ ను అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేసి 16 మాసాలు జైలులో ఉంచిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2009లో నమోదైన సీబీఐ, ఈడీ కేసులపై విచారణ నత్తకే నడకలు నేర్పుతున్నట్లుగా ఉందనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఒక దశలో తనపై జరుగుతున్న విచారణలో స్పీడు పెంచాలంటూ స్వయంగా జగనే కోర్టులకు విజ్ఞప్తి చేసుకున్నా విచారణలో వేగమైతే పెరగలేదు.

ఈ నేపధ్యంలోనే ఈరోజు హెటిరో, అరిబిందో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నా, భారతి, దాల్మియా సిమెంట్స్ కంపెనీలకు లీజులు, ఇందూగ్రూపు, వాన్ పిక్ కంపెనీలకు భూ కేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులపై విచారణ జరుగుతుంది. వీటితో పాటు ఎమ్మార్ విల్లాలు, ప్లాట్ల కేటాయింపుపై నమోదైన కేసు, ఓటుళాపురం గనుల లీజు వ్యవహారం, జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి మనీ ల్యాండరింగ్ ఆరోపణలపైన కూడా విచారణ జరుగుతుంది.

మొత్తానికి ప్రత్యేకకోర్టులో కానీ లేకపోతే రెగ్యులర్ కోర్టులో కానీ జగన్ కేసులపై జరుగుతున్న విచారణలో స్పీడు పెరిగితే కేసులు తొందరగా తెమిలే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ పై ఎన్ని కేసుల్లో విచారణ జరుగుతోంది ? ఎన్ని కేసులను కోర్టు కొట్టేసింది ? లాంటి అనేక విషయాలపై జనాల్లో క్లారిటి లేదు. అసలు జగన్ పై నమోదైన కేసుల్లో పసుందా లేదా కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే తనపై రాజకీయ కక్షతోనే రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టినట్లు జగన్ మొదటినుండి వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత గులాం నబీ ఆజాద్ ఆమధ్య మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్ లోనే ఉండుంటే అసలు కేసులే ఉండేవి కావంటు చేసిన వ్యాఖ్యలు జగన్ ఆరోపణలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఏదేమైనా కేసుల్లో విచారణ జరిపి తప్పు జరిగిందో లేదో తేల్చేస్తేనే మంచిది.