కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి

ఇటీవల ఢిల్లీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స కోసం చేరిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి అత్యంత వ్యూహాత్మక నేతగా పేరుపొందిన రాంవిలాస్ పాస్వాన్ (74) మృతి చెందారు. ఆయన గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. ఈరాత్రి తుది శ్వాస విడిచారు.

దేశంలో మంచి పేరు సంపాదించిన ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్… దాదాపు అన్ని ప్రభుత్వాల్లోనూ 2 దశాబ్దాలుగా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి గురించి కొడుకు చిరాగ్ పాశ్వాన్ ధృవీకరించారు. ‘‘ మిస్ యు పాపా.. నువ్వు ఈ లోకంలో లేవు, కానీ నాతోనే ఉంటావు‘‘ ఆయన కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ చిరాగ్ పాస్వాన్ తన నాయకుడి మరణం గురించి ట్వీట్ చేశారు.

“చాలా రోజులుగా నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా, అర్ధరాత్రి సమయంలో అతని గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అవసరమైతే, బహుశా కొన్ని వారాల తరువాత మరొక ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. ప్రతిక్షణం నాకు నా కుటుంబానికి అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. ” అంటూ గత వారం చిరాగ్ చేసి ట్వీట్ ఇది. చివరకు ఆ శస్త్రచికిత్స విఫలమై తాజాగా పాశ్వాన్ తుది శ్వాస విడిచారు.

భారతదేశం నెలరోజుల్లో రెండో మంత్రిని కోల్పోయింది. అయితే, బీహార్ లో కీలక నేత అయిన పాశ్వాన్ సరిగ్గా ఎన్నికల ముందు మరణించడం అందరినీ విస్మయానికి, దిగ్బ్రాంతికి గురిచేసింది.