డ్రాగన్ అంటే ప్రపంచదేశాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందా ?

తాజాగా నిర్వహించిన సర్వేలు అవుననే సమాధానమిస్తున్నాయి. అసలే చైనాకు ప్రపంచంలో రోగ్ నేషన్ అనే పేరుంది. ప్రతి ఒక్కళ్ళని చికాకులు పెట్టడం, ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం పాకులాగటం తదితర కారణాలతో అందరితోను శతృత్వం పెంచుకుంటోంది. వీటిన్నంటిపై ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ కు మూలకారణం చైనాయే అని బయటపడటంతో యావత్ ప్రపంచ దేశాలు డ్రాగన్ దేశంపై మండిపోతున్నాయి. ఇదే విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో స్పష్టంగా బయటపడింది.

అనేక అంశాల ఆధారంగా వ్యూ అనే పరిశోధన సంస్ధ ప్రపంచంలోని 14 అభివృద్ది చెందిన దేశాల్లో చైనాపై సర్వే నిర్వహించింది. కరోనా వైరస్ విషయంలో చైనా పాలకులు వ్యవహరించిన తీరుపై పై దేశాల్లోని ప్రజలు మండిపోతున్న విషయం స్పష్టమైంది. ఆస్ట్రేలియాలో చైనాపై వ్యతిరేక భావన పెరిగిపోతోందట. చైనా పాలకుల విషయంలో ఆస్ట్రేలియాలో 81 శాతం మంది తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇక బ్రిటన్ లో జరిపిన సర్వేలో 74 శాతం మంది జనాలు కరోనా వైరస్ కు చైనానే కారణమంటూ మండిపోతున్నారట.

ఇదే విషయంపై జర్మనీ, అమెరికాలో కూడా చైనాపై వ్యతిరేకత పెరిగిపోతున్నట్లు సర్వేలో తేలింది. మిగిలిన విషయాలు ఎలాగున్నా కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచదేశాల్లో చైనా అంటే 61 శాతం మంది బాగా మండిపోతున్నారు. డ్రాగన్ పాలకుల వల్లే ప్రపంచానికి ఇన్ని కష్టాలనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో బలంగా నాటుకుపోయిందట. చివరగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ట్రంప్ ఫెయిలైనట్లు అమెరికాలో 84 శాతం మంది మండిపోతున్నారట. అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశం కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

మిగిలిన దేశాలతో పోల్చినపుడు చైనా అంటే మనదేశంలో రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతోందన్నది స్పష్టం. లడ్డాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లో మన సైనికులపై డ్రాగన్ సైన్యం చేసిన దాడుల తర్వాత ఆ దేశంపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. హోలు మొత్తం మీద చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను ఏవిషయంలోను నమ్మలేమనే అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. తన వ్యవహార శైలి వల్ల ప్రపంచ దేశాలకు తమ దేశం దూరమైపోతున్న విషయాన్ని పాలకులు గుర్తిస్తున్నారో లేదో.