వైసిపిలో గన్నవరం హీట్ పెరిగిపోతోందా ?

అధికార పార్టీ వైసిపిలో గన్నవరం రాజకీయాల హీట్ పెరిగిపోతోంది. మామూలుగా ప్రశంతాంగా ఉండే నియోజకవర్గంలో ఎంఎల్ఏ వల్లభేనేని వంశీ వైసీపీ చేరడంతో హీట్ పెరిగిపోతోందనే ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. టీడీపీ తరపున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వంశీ చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు తర్వాత వైసిపికి దగ్గరైపోయారు. ఎప్పుడైతే వైసిపికి వంశీ దగ్గరైపోయారో వెంటనే అధికారపార్టీలో రాజకీయాలు మొదలైపోయాయి. దాంతో వంశీ కేంద్రంగా అధికారపార్టీలో రోజురోజుకు వివాదాలు పెరిగిపోతున్నాయి.

వంశీ ఎంటర్ కాకముందు వైసిపిలో దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలుండేవి. ఇద్దరు నేతల మధ్య పెద్ద సఖ్యత లేకపోయినా గొడవలు పడేంత శతృత్వం కూడా లేదు. అందులోను చాలా కాలం తర్వాత దుట్టా యాక్టివ్ అయ్యారు కాబట్టి గ్రూపులు పెద్దగా బయటపడకుండానే పార్టీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే వంశీ వైసిపికి దగ్గరగా జరగటంతో ముందుగా యార్లగడ్డ అలర్టయ్యారు. వంశీ పార్టీలోకి చేర్చుకోవటాన్ని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఈ పంచాయితీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరింది. జగన్ తో భేటి తర్వాత యార్లగడ్డకు ఆప్కాబ్ ఛైర్మన్ పోస్టు దక్కటంతో మళ్ళీ యార్లగడ్డ ఎక్కడా మాట్లాడలేదు.

ఎప్పుడైతే యార్లగడ్డ సైలెంట్ అయిపోయారో అప్పటి నుండో దుట్టా సీన్ లోకి ఎంటరైపోయారు. దుట్టా యాక్టివ్ అయిన దగ్గర నుండి వంశీపై బాగా రైజ్ అయిపోతున్నారు. ఇదే సమయంలో శనివారం భావులపాడు మండలంలోని కాకులపాడు గ్రమాంలో రైతుభరోసా కేంద్రం శంకుస్ధాపన సందర్భంగా వంశీ-దుట్టా వర్గీయుల మధ్య పెద్ద గొడవైంది. ఇదే సమయంలో తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్టంలోని నున్నలో భారీ ర్యాలి తీసిన యార్లగడ్డ వంశీపై మండిపోయారు. దాంతో వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ-దుట్టా వర్గాలు ఏకమైపోయాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

గన్నవరం నియోజకవర్గంలోని గొడవలన్నీ చివరకు జగన్ దృష్టికి వెళ్ళాయి. అయితే ఢిల్లీ వెళ్ళే బిజీలో ఉన్న జగన్ వీటిపై దృష్టి పెట్టలేదు. ఢిల్లీ నుండి తిరిగొచ్చిన తర్వాత ఈ పంచాయితీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఈలోగా జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పంచాయితీ మొదలైంది. వంశీ-యార్లగడ్డ-దుట్టా పంచాయితీతో పార్టీ జనాల ముందు పలుచనైపోయిందన్నది వాస్తవం. ఈ వివాదానికి జగన్ ఎంత తొందరగా ముగింపు పలకక పోతే వంశీతో పాటు పార్టీ కూడా పలుచనైపోయవటం ఖాయం.