క్షమాపణ చెప్పిన సబ్బం : రియలైజేషన్ మంచిదే

రాజకీయాల్లో హుందాతనం పూర్తిగా కనుమరుగైపోతోంది. ప్రస్తుత రాజకీయాలు ఎలాగున్నాయంటే ప్రత్యర్ధులపై దుమ్మెత్తిపోయటం, నోటికొచ్చినట్లు బూతులు తిట్టేయటం, ఎక్కడైనా డిబేట్ జరుగుతోందంటే ప్రత్యర్ధుల నోళ్ళను మూయించే ప్రయత్నం చేయటం అన్నట్లే ఉంది. రెండు రోజుల క్రితం వైజాగ్ లో మాజీ ఎంపి సబ్బంహరి చేసింది కూడా ఇదే. తనింటి కాంపౌండ్ వాల్ ను కూల్చేసినందుకు జీవీఎంసి ఉన్నతాధికారులతో కలిపి జగన్మోహన్ రెడ్డిని కూడా నోటికొచ్చినట్లు తిట్టేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారులను సబ్బం తిట్టిన తిట్లు విన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఇంకేముంది నెటిజన్లు సోషల్ మీడియాలో సబ్బంను ఓ రేంజిలో ఆటాడేసుకున్నారు. పార్కుస్ధలాన్ని ఆక్రమించుకున్నదే కాకుండా ఆక్రమణలను తొలగించిన వాళ్ళను పట్టుకుని నోటికొచ్చినట్లు తిడతావా ? అంటూ సబ్బంను నెటిజన్లు గట్టిగానే తగులుకున్నారు. దాంతో ఏమనుకున్నాడో ఏమో ఆదివారం సబ్బం అందరికీ క్షమాపణ చెప్పుకున్నారు. తాను ఆవేశంలో బూతులు తిట్టినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నానంటు ప్రకటించారు. శనివారం ఉదయమే తనింటికి వచ్చి కాంపౌండ్ వాల్ కూల్చేస్తున్నారన్న ఆవేశంలో తిట్టానే కానీ ఉద్దేశ్యపూర్వకంగా తిట్టలేదంటూ వివరణ ఇచ్చారు.

తానెప్పుడూ సహనం కోల్పోలేదని కానీ శనివారం ఉదయం మాత్రం సహనం కోల్పోయింది వాస్తవమే అని అంగీకరించారు. తాను మనిషినే అని, తనకూ ఫీలింగ్స్ ఉంటాయంటు పొరపాటును సమర్ధించుకునేందుకు ప్రయత్నించారు. కాంపౌండ్ వాల్ ను తొలగించమని తనకు చెప్పుంటే తానే తొలగించుండే వాడనంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు. అంటే నిజంగానే సబ్బం అది తెలియకుండా ఆక్రమించుకున్నారా… ఆయన కొన్న స్థలం ఎంతో తనకు తెలిసే ఉంటుంది కదా. గతంలో నగరానికి మేయర్ గా చేసిన వ్యక్తికి ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించుకోవటం తప్పని తెలీదా ? సబ్బం చేసిన పని కంచే చేనుమేసినట్లుగా ఉందని జనాలు చెప్పుకోవటం బహుశా మాజీ ఎంపి చెవినపడుంటుంది.

అయితే తాను క్షమాపణలు చెప్పానంటే అది ఎవరికో భయపడి మాత్రం కాదని అన్నారు. భయపడి కాకపోతే మరి దేనికి క్షమాపణలు చెప్పినట్లు ? ఎందుకంటే ఇంటి కాంపౌండ్ కూల్చివేత ఘటనలో సబ్బంకు ఎవరి నుండి పెద్దగా సానుభూతి రాలేదు. సొంతపార్టీ టీడీపీ నేతలే పెద్దగా పట్టించుకోలేదు. విశాఖ స్ధానికంగా వెలువడే సాయంత్రం దినపత్రికలన్నీ సబ్బందే తప్పన్నట్లుగా కథనాలు రాశాయట.

అంటే జనాల నుండి సానుభూతి రాక, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వక, సొంతపార్టీలోనే సపోర్టు లేకపోవటంతోనే తన పరిస్ధితి ఏమిటో సబ్బంకు బాగానే అర్ధమైఉంటుంది. సబ్బం పార్కుస్ధలాన్ని ఆక్రమించుకున్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసట. అందుకనే వేరే దారిలేక, తిట్టిన బూతులు బూమ్ రాంగ్ అయ్యిందని అర్ధమైపోయే చివరకు క్షమాపణలు చెప్పుకున్నారు. సరే ఏ కారణంతో క్షమాపణలు చెప్పినా రియలైజేషన్ రావటం మంచిదే కదా.