మంత్రులే స‌హ‌నం కోల్పోతే.. వైసీపీలో చ‌ర్చ‌

రాజ‌కీయాల‌ంటే.. వ్యూహం.. ప్ర‌తివ్యూహమేకాదు.. స‌హ‌నం చాలా అవ‌స‌రం. ప్ర‌త్య‌ర్థి ప‌క్షాల నుంచి ఎదుర‌య్యే ప్ర‌తి విష‌యంలోనూ నాయ‌కులు చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అయితే, ఈ విష‌యంలో ప్ర‌స్తుతం అదికార పార్టీ వైసీపీ మంత్రులు అనుస‌రిస్తున్న తీరు.. కోల్పోతున్న స‌హ‌నం.. రాజ‌కీయంగా అటు వారికి , పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి అనేక రూపాల్లో వ్య‌తిరేక‌త వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌తిప‌క్షం కాబ‌ట్టి చేసే ప‌ని ఇంత‌క‌న్నా ఏముంటుంది? ప‌్ర‌భుత్వ నిర్ణ‌యాల విషయంలోను, స‌ర్కారు తీసుకునే చ‌ర్య‌ల విష‌యంలోనూ లోపాల‌ను ఎత్తి చూప‌డ‌మే కదా? అయితే, ఇవి కొన్ని సార్లు అతికావొ చ్చు. లేదా స‌ర్కారుకు నిజంగానే తీవ్ర ఇబ్బందిక‌ర వాతావర‌ణం సృష్టించేవీ కావొచ్చు. కానీ, సంయ‌మ‌నం అనేది ముఖ్యం. అధికారంలో ఉన్న నేత‌ల‌కు సంయ‌మ‌నం.. స‌హ‌నం.. ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం అనేవి చాలా కీల‌కం. కానీ, ప్రస్తుతం సీఎం జ‌గ‌న్‌.. ఇంత స‌హ‌నంతోనే ఉన్న‌ప్ప‌టికీ.. కొంద‌రు మంత్రులు మాత్రం ఈ స‌హ‌నం అనే ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటేస్తున్నారు. ఫ‌లితంగా వారు ఇబ్బందులు తెచ్చుకుంటు న్నారు. ఇటు పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఏ విష‌యంలోనైనా స్పందించే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, తాజాగా డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాష్‌.. చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌కరం. ఈ విష‌యం స్వ‌యానా ఆయ‌నకు కూడా తెలుసు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఒప్పుకొన్నారు కూడా. కానీ, ఎక్క‌డో పేరుకున్న అస‌హ‌నం క‌ట్ట‌లు తెగిన నేప‌థ్యంలోనే మంత్రి ఇలా వ్యాఖ్య‌లు జారార‌ని అనుకున్నా.. ప్ర‌జాస్వామ్యం, రాజ్యాంగం అంటూ ఉన్నాయి కాబ‌ట్టి.. ఇవి అంతిమంగా చేటు చేస్తాయి. పైకి సానుభూతి ప‌రులు చంక‌లు గుద్దుకున్నా.. ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అయ్యేందుకు అవ‌కాశం ఎక్కువ‌.

ఇప్ప‌టికే మంత్రి కొడాలి నానిపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌వారు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కృష్ణ‌దాస్ చేరడం .. సీనియ‌ర్ నాయ‌కుడు, మంచి ఫాలోయింగ్ ఉన్న నాయ‌కుడిగా ఇది మంచి ప‌రిణామం కాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిర్మాణాత్మ‌క‌మైన రాజ‌కీయాలు చేయాల‌నుకునే నేటి త‌రానికి దాసు వంటి నాయ‌కులు స్ఫూర్తిగా ఉండాలే త‌ప్ప‌.. స‌హ‌నం అనే ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటితే.. ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.