షూటింగ్ స్పాట్‌గా రుషికొండ ‘ప్యాలెస్‌’?

విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌. ఒక‌ప్పుడు ఇది ప‌ర్యాట‌క ప్రాంతంగానే గుర్తింపు ఉంది. కానీ.. వైసీపీ హ‌యాంలో మాత్రం పొలిటిక‌ల్‌గా కూడా.. ఈ కొండ‌.. కొండంత రాజ‌కీయానికి కేంద్రంగా మారింది. దీనికి కార‌ణం.. వైసీపీ హ‌యాంలో ఇక్క‌డ కొండ‌ను తొలిచేయ‌డం.. భారీ నిర్మాణాలు క‌ట్టేయ‌డం. క‌నీసం.. పురుగును కూడా చొర‌బ‌డ‌కుండా.. ప‌టిష్ఠమైన భ‌ద్ర‌త న‌డుమ ఇక్క‌డ విలాస వంత‌మైన భ‌వ‌నాల‌ను నిర్మించారన్న‌ది తెలిసిందే. అయితే.. దీనిపై కోర్టులోనూ.. అటు హ‌రిత ట్రైబ్యున‌ల్‌లోనూ కేసులు న‌డుస్తున్నాయి.

సుమారు 500 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసి రుషి కొండ‌పై భారీ భ‌వంతులు విలాస వంతంగా క‌ట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్ర‌భుత్వం ఇంకా అధికారికంగా ఖ‌ర్చులు, లెక్క‌లు వెల్ల‌డించ‌లేదు. కానీ, రాజ‌కీయంగా రూ.500 కోట్ల‌పైనే ఖ‌ర్చ‌యి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక‌, ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అనూహ్యంగా ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఇంత విలాస వంత‌మైన భ‌వంతిని ఏం చేయాల‌న్న‌దానిపై ప్ర‌భుత్వం కూడా క‌స‌ర‌త్తు చేస్తోంది. నిజానికి వైసీపీ మ‌రోసారి అదికారంలోకి వ‌స్తే.. జ‌గ‌న్ రెండోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేస్తే..ఇక్క‌డే కొలువుదీరాల‌ని భావించారన్న చ‌ర్చ కూడా ఉంది.

ఇక‌, ఆయ‌న అధికారంలోకి రాలేదు. కానీ, గుదిబండ‌లా ఇప్పుడు రుషికొండ మిగిలిపోయింద‌నే వాద‌న ఉంది. ఇదిలావుంటే.. నాలుగు మాసాలుగా దీనిపై క‌స‌ర‌త్తు చేస్తున్న చంద్ర‌బాబు స‌ర్కారుకు అనేక రూపాల్లో స‌ల‌హాలు , సూచ‌న‌లు వ‌చ్చాయి. ప్ర‌ఖ్యాత తాజ్ హోట‌ల్స్‌కు(టాటా గ్రూప్‌) విడిది గృహంగా అద్దెకు ఇవ్వాల‌నికొంద‌రు సూచించారు. మ‌రికొంద‌రు.. ప్ర‌భుత్వ‌మే క్యాంపు ఆఫీసుగా మార్చుకోవాల‌ని, క‌లెక్ట‌ర్ బంగ్లాగా మార్చాల‌ని.. రాష్ట్ర‌ప‌తి నిల‌యంగా మార్చాల‌ని ఇలా అనేక స‌ల‌హాలు వ‌చ్చాయి. కానీ, దేనికీ స‌ర్కారు మొగ్గు చూప‌లేదు.

మ‌రోవైపు ఈ ప్యాలెస్ నిర్వ‌హ‌ణ‌కు(భ‌ద్ర‌త‌, క‌రెంటు ఖ‌ర్చులు) నెల‌కు 6 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా వెలుగు చూసిన విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. రుషికొండ‌పై నిర్మించిన రాజ ప్రాసాదాన్ని.. సినిమా షూటింగుల‌కు స్పాట్‌గా మార్చ‌నున్న‌ట్టు తెలిసింది. దీనికి త‌గిన ఆధారాలు కూడా ల‌భిస్తున్నాయి. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ నిశితంగా ప‌రిశీలించ‌డంతోపాటు.. దీనిని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు అప్ప‌గించ‌డం.. ఆయ‌న స్వ‌యంగా కొంద‌రు నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌తోనూ ఫోన్‌లో సంభాషించ‌డం వంటివి ఈ ప్యాలెస్‌ను సినిమా స్పాట్‌గా మార్చ‌నున్నార‌న్న వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది. త‌ద్వారా.. ప్ర‌భుత్వానికి ఆదాయంతో పాటు.. విశాఖలో సినీ కార్య‌కలాపాలు పుంజుకుంటాయ‌న్న అభిప్రాయం కూడా ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.