జగన్ వెర్సస్ షర్మిళ.. చర్చలోకి వైఎస్ అవినీతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య నెలకొన్న విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ షర్మిళ జగన్‌ను ఘాటుగా విమర్శించడం.. జగన్ తన పార్టీ వాళ్లతో ఆమె మీద మాటల దాడి చేయించడమే చూశాం.

కానీ ఇప్పుడు పరస్పరం కేసులు పెట్టుకునే స్థాయికి విభేదాలు ముదిరిపోయాయి. జగన్, షర్మిళ పరస్పరం ఘాటుగా రాసుకున్న లేఖలు కూడా మీడియాలోకి వచ్చేశాయి. సరస్వతి పవర్‌ సంస్థ నుంచి షేర్ల బదిలీ విషయంలో ఇరువురి మధ్య పెద్ద గొడవే నడుస్తున్న సంగతి వెల్లడైంది.

అంతే కాక వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా సంపాదించిన ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఇరువురి మధ్య దీర్ఘ కాలంగా విభేదాలు నెలకొన్న విషయం మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఐతే చూడ్డానికి ఇది కుటుంబ గొడవ లాగా కనిపించినా.. జనాల దృష్టికోణం మరోలా ఉంది. అసలు ఆస్తి పంపకాల విషయంలో జగన్, షర్మిళ మధ్య గొడవ ఎక్కడ మొదలైందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తాతల నుంచి వచ్చిన ఆస్తుల విషయంలో గొడవ పడడానికి ఏమీ ఉండదు. ఇక్కడ జగన్, షర్మిళ మధ్య గొడవ అది కాదు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుటుంబ ఆస్తులు అసాధారణంగా పెరిగాయి.

ముఖ్యంగా తండ్రిని అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా జగన్ అనేక కంపెనీలు పెట్టి వాటిలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టించగలిగారు. దీనికి సంబంధించే ఆయన మీద పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి. ఐతే ఇలా సంపాదించిన అక్రమ ఆస్తులు, పెట్టిన కంపెనీలు అన్నీ తన తెలివితేటలతో వచ్చినవి అని జగన్ అభిప్రాయం. కానీ తండ్రి అధికారం ద్వారానే ఇవన్నీ సాధ్యమయ్యాయి కాబట్టి అందులో తనకూ సమాన వాటా ఉండాలన్నది షర్మిళ వాదన.

ఈ నేపథ్యంలోనే వైఎస్ మరణానంతరం ఈ ఆస్తుల గొడవ మొదలై.. దీర్ఘ కాలంగా నానుతూ వస్తోంది. ఇప్పుడు జగన్, షర్మిళ ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు సంధించుకోవడం, కేసులు పెట్టుకోవడం చూసి.. వైఎస్ కుటుంబ గుట్టు రట్టవుతోంది. వైఎస్ సీఎంగా ఉండగా జరిగిన అవినీతి, ఆయన కుటుంబానికి సంక్రమించిన ఆస్తుల గురించి జనాల్లో చర్చ జరుగుతోంది.